‘వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే ముందస్తు’ 

8 Sep, 2018 03:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని మాజీ మంత్రి కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం తన నివాసంలో మండలిలో విపక్ష నేత షబ్బీర్‌అలీ, మాజీ మంత్రులు డి.కె.అరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ నేత విక్రంగౌడ్‌లతో సమావేశమైన జానా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారన్న ప్రశ్నకు కేసీఆర్‌ ఇప్పటికీ సరైన సమాధానం ఇవ్వలేదన్నారు.

టీఆర్‌ఎస్‌ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికే చేటు తెచ్చేలా ఉందని, అకారణంగా ముందస్తు ఎన్నికలకు వెళుతూ త్యాగం అంటున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ నష్టపోతుం దని తెలిసినా ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీదే నిజమైన త్యాగమన్నారు. స్వాతంత్య్రం కోసం జైలు శిక్ష అనుభవించి, ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన గాంధీ కుటుంబంపై నోరు పారేసుకునేందుకు కేసీఆర్‌కు సంస్కారం ఉండాలని అన్నారు.    

మరిన్ని వార్తలు