రాం మాధవ్‌ క్షమాపణ చెప్పాలి: జీవన్‌రెడ్డి

7 Jul, 2018 02:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు మగతనం లేదంటూ మాట్లాడిన బీజేపీ జాతీయనేత రాం మాధవ్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆర్మూరు ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బీజేపీ నేతలు కనీస సంస్కారం లేకుండా హీనంగా మాట్లాడుతున్నారన్నారు.

శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాంమాధవ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అమలాపురానికి చెందిన రాం మాధవ్‌ తెలంగాణ నుంచి వెళ్లకుండానే క్షమాపణ చెప్పాలన్నారు. బీజేపీ భారతీయ సంస్కృతిని పరిరక్షించే పార్టీయా, కించపరిచే పార్టీనో చెప్పాలన్నారు. కమలం పువ్వు తెలంగాణలో వాడిపోయిందని, అది ఎప్పటికీ వికసించదన్నారు. జాతీయస్థాయిలోనూ బీజేపీకి ఎదురుదెబ్బలు తప్పవని హెచ్చరించారు.  బీజేపీకి తగిన బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు