ఓ బీసీ వ్యక్తి స్పీకర్గా ఉండటాన్ని ఓర్చుకోలేకపోతున్నారా?
బీసీలను ఇంత దారుణంగా అవమానిస్తారా..
టీడీపీ ఈ–పేపర్లో వాడిన భాష సమాజం తలదించుకునేలా ఉంది
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ మండిపాటు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్కు బీసీలంటే ఎందుకంత చులకని అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ప్రశ్నించారు. బీసీ వ్యక్తి స్పీకర్గా ఉండటాన్ని వారిద్దరూ ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. వీరిద్దరి తీరు అగ్రకుల అహంకారానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. బీసీలను అవమానిస్తున్న టీడీపీని బీసీలే భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారిక ఈ–పేపర్లో స్పీకర్ తమ్మినేని సీతారాంను దూషిస్తూ కథనం రావడంపై మండిపడ్డారు.
స్పీకర్ స్థానానికి ఉన్న గౌరవ మర్యాదలను టీడీపీ నేతలు మంట గలుపుతున్నారని మండిపడ్డారు. పత్రికల్లో రాయలేని విధంగా తమ్మినేనిని దూషిస్తారా అని నిప్పులు చెరిగారు. టీడీపీ ఈ–పేపర్లో ఆయనను ఉద్దేశించి వాడిన భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. చంద్రబాబు, లోకేశ్.. తమ్మినేని కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలన్నారు. లేకుంటే వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్పీకర్గా తమ్మినేనిని ఎన్నుకున్న సమయంలో కూడా చంద్రబాబు ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టేందుకు రాకుండా కించపరిచారని విమర్శించారు. స్పీకర్ను కించపరిచిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. తమ్మినేనిని దూషించినందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఏకమై టీడీపీని రాష్ట్రం నుంచి తరిమేస్తారన్నారు. చంద్రబాబు,లోకేశ్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.