బెగుసరాయ్‌ నుంచి కన్హయ్య కుమార్‌ పోటీ 

12 Mar, 2019 13:17 IST|Sakshi

పాట్నా : జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. బీహార్‌లోని బెగుసరాయ్‌ నియోజకవర్గం నుంచి కన్హయ్య కుమార్‌ పోటీ చేస్తున్నట్లు మహా కూటమి ప్రకటించింది. అయితే దీనిపై ఆర్జేడీ ఇంకా స్పష్టతను ఇవ్వాల్సి ఉంది. కన్హయ్య పోటీపై బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గతంలో సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌, ఆర్జేడీ, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ, హిందూస్థానీ ఆవామ్‌ మోర్చా(సెక్యూలర్‌), వికాస్‌షీల్‌ ఇసాన్‌ పార్టీ, వామపక్షాలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహాకూటమిగా ఏర్పడ్డాయి.
కన్నయ్య కుమార్‌పై 1200 పేజీల ఛార్జ్‌షీట్‌

కన్హయ్య కుమార్‌.. సీపీఐ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగనున్నారు. బెగుసరాయ్‌ లోక్‌సభ స్థానం నుంచి మహాకూటమి అభ్యర్థిగా కన్హయ్య పోటీ చేస్తున్నట్లు సీపీఐ పార్టీ సీనియర్‌ నాయకుడు నరేష్‌ పాండే మంగళవారం ప్రకటించారు. బిహార్‌లో సీట్లు పంపకాలపై కాంగ్రెస్‌, ఆర్జేడీ, ఆర్‌ఎల్‌ఎస్పీ భేటీ కానుంది. వీరి సమావేశంలో కన్హయ్య అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 2016లో కన్హయ్య కుమార్‌పై ఢిల్లీలో దేశద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే.
చిక్కుల్లో కన్హయ్యకుమార్‌.. కేసు నమోదు!

దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఛార్జీషీట్‌ రూపొందించి ఇటీవలే పాటియాలా హౌజ్‌ కోర్టులో సమర్పించారు. 2016లో జేఎన్‌యూలో జరిగిన ఓ కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేయడంతోపాటు పార్లమెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా మాట్లాడారని అతను ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఆయన తొలిసారి బరిలో నిలువనున్నారు.  ఏప్రిల్‌ 29న బిహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. 

మరిన్ని వార్తలు