బీజేపీకి చంద్రబాబే క్యాంపెనర్‌: బీజేపీ అధ్యక్షుడు

20 Jan, 2019 19:36 IST|Sakshi

సాక్షి, గుంటూరు: సీఎం చంద్రబాబు నాయుడు నిత్యం కేంద్రంపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీకి చంద్రబాబు ఓ క్యాంపెనర్‌గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయాలు ముఖ్యం కాదని ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ సహాయం చేస్తున్నారని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పనిలో చంద్రబాబు కమీషన్‌లు దండుకుంటున్నారని ఆరోపించారు.  కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరి సోమవారం గుంటూరు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్క గడ్కరి శాఖ నుంచే మూడు లక్షల కోట్ల నిధులు ఏపీకి వచ్చాయని వివరించారు.

‘నోట్ల రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాసింది నేనే అని చెప్పిన మాటలు చంద్రబాబు మర్చిపోయారా? డీమానిటైజేషన్‌ కమిటీకి కన్వీనర్‌ చంద్రబాబే గుర్తుంది కదా. ఏదైనా సమస్య ఉంటే దానికి బాబే బాధ్యత వహించాలి. మోదీ మరలా ప్రధాని అయితే జైలుకు పోతామనే భయంతో దొంగలంతా ఓ చోటకు చేరారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మోదీ అంతటి ధైర్యశాలైన ప్రధానిని చూడలేదు. 2014 కంటే అత్యధిక మెజారిటీతో మోదీ తిరిగి ప్రధాని అవుతారు’అంటూ కన్నా లక్ష్మీనారాయణ విశ్వాసం వక్తం చేశారు. 

మరిన్ని వార్తలు