నల్లచొక్కాతో చంద్రబాబు కొత్తవేషాలు

2 Feb, 2019 07:47 IST|Sakshi

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

విశాఖపట్నం, మద్దిలపాలెం: అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నల్లచొక్కాతో సరికొత్త డ్రామాలు వేస్తున్నారని, అధికారమే పరమవ«ధిగా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు.శుక్రవారం ఆయన పార్టీ నగర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ విష్ణుకుమార్‌రాజుపై వాడిన పదజాలం ఆయన ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీకి తగినట్టుగా లేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా నాలుగున్నరేళ్ల క్రితం నరేంద్ర మోదీని కీర్తించి, అభినందిస్తూ తీర్మానంచేసిన బాబు నేడు ఎన్నికలలో రాష్ట్ర ప్రజలను దగా చేసేందుకు.. అదే నరేంద్ర మోదీమోసం చేసారని పేర్కొనడం హాస్యాస్పదమన్నారు.

రాష్ట్రంలో మోదీ, అమిత్‌షా సభలు
ప్రధాని నరేంద్ర మోదీ రెండుసార్లు, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మూడు సార్లు రాష్ట్రంలో పర్యటించనున్నారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈనెల 10న గుంటూరులో, 16న విశాఖలో జరిగే సభలకు మోదీ హాజరవుతారన్నారు. శక్తి కేంద్రాలను బలోపేతం చేయడానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఈనెల 4న విజయనగరంలో జరిగే పార్లమెంట్‌ స్థాయి శక్తి కేంద్రాల సభ్యులతో సమావేశమవుతారన్నారు. అనంతరం పలాస నుంచి సత్యమేవ జయతే బస్సు యాత్రను ఆయన ప్రారంభిస్తారన్నారు. 19న ఒంగోలు, 21 రాజమహేంద్రవరంలో శక్తి కేంద్రాల సభ్యులతో సమావేశం అవుతారన్నారు. సమావేశంలో సీనియర్‌ నాయకుడు చలపతిరావు, నగర అధ్యక్షుడు ఎం.నాగేంద్ర, పార్టీ రాష్ట ఉపాధ్యక్షుడు కె.నాగభూషణ్, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని, జాతీయ కార్యవర్గ సభ్యుడు పేర్ల సాంబశివరావు, సన్యాసిరావు, రాష్ట ఇన్‌చార్జి గోయల్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు