ఛీటింగ్‌లో నెంబర్‌ వన్‌ కేసీఆర్‌ ఫ్యామిలీ : రేవంత్‌

8 Feb, 2018 17:24 IST|Sakshi
కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ : మోదీ ప్రభుత్వం నుంచి తెలంగాణాకు రావల్సిన వాటిపై ప్రశ్నించకుండా ..టీఆర్‌ఎస్‌ ఎంపీలు మోదీ కాళ్ల దగ్గర మోకరిల్లారని, కేసీఆర్ కుటుంబం చీటింగ్ చేయడంలో నంబర్ వన్‌ అని కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..పార్లమెంటులో రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులు పోరాడుతుంటే..టీఆర్‌ఎస్‌ ఎంపీలు మాత్రం మౌనంగా ఉండి మోదీకి మద్దతు పలికారని, సీబీఐ కేసుల భయంతోనే సీఎం కేసీఆర్ తన పార్టీ నాయకులకు ఆవిధంగా ఆదేశాలిచ్చారని వ్యాఖ్యానించారు.

మోదీని పార్లమెంటులో ఎందుకు ప్రశ్నించడం లేదని సూటిగా టీఆర్‌ఎస్‌ నాయకులను అడిగారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ లోఫర్ పార్టీనా? మోదీని ప్రసన్నం చేసుకునేందుకే కేటీఆర్.. కాంగ్రెస్‌ను తిడుతున్నారని, తెలంగాణకు మొదటి సీఎం దళితుడ్ని చేస్తానన్న కేసీఆర్‌ మాట ఎటుపోయిందని ప్రశ్నించారు. డిసెంబర్ 31, 2017 లోగా మిషన్ భగీరథ నీళ్లు ఇస్తామన్న కేసీఆర్ మాట ఎక్కడ? అని వ్యాఖ్యానించారు. ఓట్లు అడగనని అన్న కేసీఆర్ సవాల్ ఎక్కడ పోయింది ? ఈ విషయంపై కేటీఆర్ స్పందించాలన్నారు. రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తానని , లేకపోతే కేసీఆర్ ఓట్లు అడగన్నది నిజం కాదా ? అని సూటిగా అడిగారు.

 టీఆర్‌ఎస్ అంటేనే లత్కోర్ పార్టీ అని, దాన్ని నడుపుతున్నది ఛీటర్స్ ఫ్యామిలీ అని అన్నారు.తెలంగాణ అమరవీరుల ఆత్మ ఘోష కేసీఆర్ కుటుంబానికి తగులుతుందన్నారు. దోచుకున్న సొమ్మును విదేశాలలో దాచుకునేందుకే కేటీఆర్ విదేశీ టూర్లకు వెళుతున్నారన్నారు. జైలు భయం కేటీఆర్‌కు పట్టుకుందని అన్నారు. విదేశీ పర్యటనల్లో చేసిన ఖర్చు ఎంత ..? పెట్టుబడులేంటో ?శ్వేత పత్రం విడుదల చెయ్యాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌కు తన సవాల్ పై చిత్తశుద్ధి ఉంటే ..కేటీఆర్ పాస్ పోర్ట్‌ను డీజీపీ దగ్గర డిపాజిట్ చేయాలన్నారు.

>
మరిన్ని వార్తలు