కాంగ్రెస్‌తో పొత్తుపై మరోసారి కేఈ వ్యాఖ్యలు

26 Aug, 2018 14:06 IST|Sakshi

సాక్షి, కర్నూలు : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అంశం టీడీపీతో తీవ్ర కలకలం రేపుతోంది. కాంగ్రెస్‌ దౌర్భాగ్యం తమకెందుకంటూ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇటీవల వ్యాఖ్యానించడం.. దానికి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య కౌంటర్‌ ఇవ్వడం తెలిసిందే. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని ఇటు చంద్రబాబునాయుడు, అటు టీడీపీ నాయకత్వం సంకేతాలు ఇస్తున్నా.. కేఈ కృష్ణమూర్తి వెనుకకు తగ్గడం లేదు. ఆయన మరోసారి పొత్తు అంశంపై మాట్లాడారు. తెలుగుదేశం జాతీయ పార్టీ అని, ఇతర రాష్ట్రాల్లో పలు పార్టీలతో టీడీపీ పొత్తులు ఏ విధంగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ఉండబోదని ఆయన తెగేసి చెప్పారు.

ఇప్పటికే కేఈ వ్యాఖ్యలపై వర్ల రామయ్య మండిపడిన సంగతి తెలిసిందే. పార్టీ వేదికల్లో అభిప్రాయం చెప్పాలని, బహిరంగంగా మాట్లాడి పార్టీ కేడర్‌కు ఏం సందేశమిస్తున్నారని కేఈని ఉద్దేశించి వర్ల వ్యాఖ్యానించారు. వర్ల ఎవరు తనకు చెప్పడానికని డిప్యూటీ సీఎం కేఈ మండిపడ్డారు. కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో కిందిస్థాయి కేడర్‌ నుంచి వచ్చిన అభిప్రాయాలనే తాను వెల్లడించానని చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఎన్‌టీఆర్‌ పార్టీని స్థాపించారనే విషయం తమ మనస్సుల్లో హత్తుకుపోయిందన్నారు. కాంగ్రెస్‌ పొత్తుపై మాట్లాడినందుకు సీఎం చంద్రబాబు తనను మందలించారనడంలో నిజం లేదన్నారు. ధర్మపోరాటం  సభలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఈ నేతలు ఇరువురు మీడియాతో మాట్లాడారు.   
 

మరిన్ని వార్తలు