ప్రభాస్‌ను ఎన్నికల ప్రచారానికి వాడుకోం

3 Jul, 2018 04:36 IST|Sakshi

పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా

కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు

సాక్షి, అమరావతి బ్యూరో: ప్రభాస్‌ ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో ఎదుగుతున్నాడని, అతడిని బీజేపీ ఎన్నికల ప్రచారంలో వినియోగించదలచుకోలేదని కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్‌ సోమవారం పాత్రికేయులతో ఇష్టాగోష్టిలో ఈ వాఖ్యలు చేశారు. ప్రభాస్‌ రాజకీయాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉందన్నారు. ప్రజలను మోసం చేస్తూ తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబు పాపం పండే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి పనిలో అవినీతికి పాల్పడుతోందని, యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు అడుగుతుంటే లేఖలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పార్టీ అగ్రనాయకత్వం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధమన్నారు. 1998 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పటికన్నా, బీజేపీతో కలసి పోటీ చేసిన 1999 ఎన్నికల్లోనే టీడీపీకి అధిక సీట్లు వచ్చాయని, టీడీపీ మాత్రం బీజేపీ వల్ల నష్టపోయామని అసత్యాలను ప్రచారం చేస్తోందన్నారు.  

>
మరిన్ని వార్తలు