రెబెల్స్‌కు బుజ్జగింపులు

12 Jan, 2020 01:54 IST|Sakshi

పార్టీ నేతలతో కార్యనిర్వాహక అధ్యక్షుడు భేటీ 

రెబెల్స్‌ను ఉపసంహరించుకోవాలని ఆదేశం 

నేడూ కొనసాగనున్న కేటీఆర్‌ బుజ్జగింపులు

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో రెబెల్స్‌ సెగ చల్లారట్లేదు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్వయంగా రంగంలో దిగి వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం సాయం త్రం తిరిగొచ్చి.. తిరుగుబాటు అభ్యర్థుల సమస్య తీవ్రంగా ఉన్న పురపాలికలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలను శనివారం తెలంగాణ భవన్‌కు పిలుపించుకుని వేర్వేరుగా మాట్లాడారు. పార్టీపరంగా స్థానికంగా ఉన్న సమస్యలేంటి.. రెబెల్స్‌ సమస్య ఎందు కు ఎక్కువగా ఉందని ఆరా తీశారు. తిరుగుబా టు అభ్యర్థులను వీలైనంత త్వరగా బుజ్జగించి నామినేషన్లు ఉప సంహరించుకునేలా ఒప్పించాలని పార్టీ నేతలను ఆదేశించారు. పోటీ నుంచి వైదొలిగే రెబెల్స్‌కు పార్టీలో గౌర వం, సముచిత స్థానం ఉంటుందని భరోసా కల్పించాలని సూచించారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన వారికి పార్టీలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, నామినేటెడ్‌ పదవుల సందర్భంగా ప్రాధాన్యమిస్తామని చెప్పారు.

తన మాట కాదని రెబెల్స్‌ ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసినా, రెబెల్స్‌తో పోటీ చేయించినా, సహకారం అందించినా భవిష్యత్తులో వారి ముఖం కూడా చూడనని కేటీఆర్‌ తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. టికెట్ల పంపిణీ బాధ్యతల్లో ఉన్న నేతలు ఒక్కో వార్డు వారీగా పరిస్థితిని సమీక్షించి గెలిచే అభ్యర్థులకు మాత్రమే బీ–ఫారాలు ఇవ్వాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక, బీ–ఫారాల అందజేత విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. నామినేషన్లు, పార్టీ అభ్యర్థుల సంఖ్య, ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం కూడా కేటీఆర్‌ తెలంగాణభవన్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉం టారని పార్టీ వర్గాలు తెలిపాయి. 14న మ ధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా, రెబెల్స్‌ను పో టీ నుంచి తప్పించేందుకు చివరి నిమిషం వరకు బుజ్జగింపులు కొనసాగే అవకాశాలున్నాయి. 

ఫిర్యాదుల వెల్లువ.. 
తమ వ్యతిరేకవర్గం నేతలు రెబెల్స్‌ను ప్రోత్సహిస్తున్నారని ఈ సమావేశంలో పలువురు పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్‌ దృష్టికి తెచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ మున్సిపాలిటీలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన అనుచరులతో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరఫున అభ్యర్థులుగా నామినేషన్‌ వేయించారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహంలు ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్‌ జూపల్లిని పిలిపించి మాట్లాడారు. తన అనుచరులతో నామినేషన్లు ఉపసంహరింపజేయాలని జూపల్లికి సూచించారు. కేటీఆర్‌తో భేటీ అనంతరం జూపల్లి మాట్లాడుతూ.. కొన్ని మనస్పర్థలు రావడం సహజం అంటూనే రెబెల్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 

  • మాజీ ఎమ్మెల్యే ఎడమ కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అనుచరులు కల్వకుర్తి మున్సిపాలిటీలో తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేశారని స్థానిక ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఎవరి సత్తా ఎంటో ఎన్నికల్లో తేలిపోతుంది అంటూ కేటీఆర్‌తో సమావేశం అనంతరం జైపాల్‌యాదవ్‌ వెళ్లిపోయారు.  
  • తాండూరు మున్సిపాలిటీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మధ్య మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ రెండ్రోజుల కింద రాజీ కుదిర్చారు. అయినా మహేందర్‌రెడ్డి అనుచరులు నామినేషన్లు వేశారని కేటీఆర్‌కు రోహిత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇక్కడ 36 వార్డులుంటే టీఆర్‌ఎస్‌ నుంచి 139 మంది నామినేషన్లు వేశారని కేటీఆర్‌కు వివరించారు. 
  • కేటీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీలో 30 వార్డులుంటే దాదాపు 20 వార్డుల నుంచి రెబెల్స్‌ బరిలో దిగారు. రెబెల్స్‌ అందరినీ కేటీఆర్‌ పిలిపించి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని నచ్చజెప్పారు. 
  • పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవిని ఆశిస్తున్న దర్గా దయాకర్‌రెడ్డిని శుక్రవారం కాంగ్రెస్‌ కండువా కప్పి రేవంత్‌రెడ్డి పార్టీలో చేర్చుకోవడం.. అదే రోజున మంత్రి మల్లారెడ్డి ఆయన్ను బుజ్జగించి తిరిగి టీఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చారు. 
  • కొత్త ప్రభాకర్‌రెడ్డిని కేటీఆర్‌ పిలుపుపించుకుని సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ మున్సిపాలిటీ అభ్యర్థుల ఎంపికపై సూచనలు చేశారు. 
  • నిజమాబాద్‌ మున్సిపల్‌ ఎనిక్నల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం రాజ్యసభ సభ్యు డు డి. శ్రీనివాస్‌ ప్రయత్నిస్తున్నారన్న సమా చారంతో డీఎస్‌ వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేటీఆర్‌ సూచించారు.

సిరిసిల్లలో 91% టికెట్లు బీసీలకే.. 
సమావేశంలో ఒక్కో నేతతో ప్రత్యేకంగా సమావేశమైన కేటీఆర్‌.. క్షేత్ర స్థాయిలో ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, పార్టీ వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. సిరిసిల్ల మున్సిపాలిటీ నుంచి పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఏకంగా 91% బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ప్రచారంపై దృష్టి సారించాలని సూచించారు. పార్టీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ చేసిన మార్గనిర్దేశం ప్రకారం అందరూ పనిచేయాలన్నారు. పురపాలికల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం ఉండాలన్నారు. ప్రతి ఇంటికి టీఆర్‌ఎస్‌ ప్రచారం, అభ్యర్థి చేరేలా కార్యచరణ ఉండాలన్నారు. పార్టీ ప్రచార సామాగ్రి చేరవేత వంటి అంశాలపై పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

పురపాలికలకు దగ్గర ఉన్న గ్రామీణ ప్రాంతాల పార్టీ నేతల సేవలు వినియోగించుకోవాలన్నారు. పార్టీ ఇన్‌చార్జులు లేని పురపాలికల్లో పార్టీ నేతల సేవలు అందిస్తామన్నారు. రానున్న 10 రోజులు కష్టపడి పనిచేయాలని, ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని కేటీఆర్‌ హెచ్చరించారు. మంత్రులు నిరంజన్‌ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు గణేశ్‌ గుప్తా, రెడ్యా నాయక్, సంజయ్‌ కుమార్, కోనేరు కోనప్ప, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, రవిశంకర్, బొల్లం మల్లయ్య యాదవ్, గ్యాదరి కిశోర్, గొంగిడి సునీత, విట్టల్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, జైపాల్‌ యాదవ్, క్రాంతి కిరణ్, రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌లతో కేటీఆర్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు