లోకేశ్‌పై చర్యలు తీసుకోవాలి : కన్నబాబు

17 Jun, 2020 21:31 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలి చరిత్రలో ఇదొక దురుద్దినం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మండలి వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్సీలు మంత్రులపై దాడికి దిగారని తెలిపారు. టీడీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన చేస్తుంటే సరికాదని చెప్పినట్టు వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ సభలో ఫొటోలు తీస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ సభ్యులు దాడి చేశారని చెప్పారు. (చదవండి : మంత్రి వెల్లంపల్లిపై టీడీపీ ఎమ్మెల్సీల దాడి)

ప్రజాసంక్షేమం, ప్రజా ప్రయోజనం జరగనివ్వమని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చెప్తున్నారని తెలిపారు. డిప్యూటీ చైర్మన్‌ తీరు ఆక్షేపణీయంగా ఉందని అన్నారు. మూడ్‌ ఆఫ్‌ ద ఫ్లోర్‌ తీసుకోవాలని నాలుగు గంటలుగా కోరిన పట్టించుకోలేదని చెప్పారు. బీజేపీ, పీడీఎఫ్‌, ఇతర సభ్యుల అభిప్రాయాలను కూడా ఆయన పరిగణలోకి తీసుకోరా అని ప్రశ్నించారు. లోకేశ్‌ సభలో ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారని.. ఇది సభను చులకన చేయడమేనని విమర్శించారు. లోకేశ్ సభ్యుల హక్కులను కాలరాశారని మండిపడ్డారు. లోకేష్‌ తీరుపై సభ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై దాడి చేసిన టీడీపీ సభ్యులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. మండలి నిరవధిక వాయిదా వెనక యనమల ప్లాన్‌ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు