‘జగన్‌ ఏం చేస్తాడులే.. అనుకున్నారు’

19 Oct, 2019 16:42 IST|Sakshi

సాక్షి, కాకినాడ : అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవడానికి, ఇచ్చిన మాట ప్రకారం నిధులను మంజూరు చేసి, దేశంలోనే ప్రైవేట్‌ డిపాజిట్‌దారులను ఆదుకున్న మొదటి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు తెచ్చుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రశంసించారు. శనివారం కాకినాడలో మాట్లాడిన ఆయన .. గతంలో బాధితులు ఆందోళన చేస్తే టీడీపీ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టడమే కాక, అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేయడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చి ఏం చేస్తాడులే.. అంటూ చంద్రబాబు రూ. 65 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు, వేల కోట్ల అప్పులతో ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయారని మంత్రి విమర్శించారు. ఇచ్చిన మాట కోసం మొదటగా రూ. 10 వేల లోపు డిపాజిట్లు ఉన్నవారికి ప్రభుత్వమే నేరుగా చెల్లించబోతోందని తెలిపారు.

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్న తాము ఇవాళ ఆనందం వ్యక్తం చేసే రోజు అని హర్షం వెలిబుచ్చారు. అగ్రిగోల్డ్‌ బాధితుల తరపున పోరాటం చేసిన తర్వాత తమ కార్యాలయంలోనే దాదాపు 80 శాతం మంది బాధితులు తమపేర్లు ఇచ్చారని వెల్లడించారు. ఇవ్వాళ ఏ కష్టం వచ్చినా వైఎస్‌ జగన్‌ ఉన్నాడనే ధైర్యంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. రామచంద్రాపురం చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం వల్ల ప్రజాప్రతినిధులుగా మేం గర్వపడుతున్నామన్నారు. నిధులు మంజూరు చేయడం హర్షణీయమని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు