లాలూ అక్రమాల చిట్టా : చుక్కలు చూపిస్తున్న ఏజెన్సీలు

23 Dec, 2017 19:01 IST|Sakshi

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీలు చుక్కలు చూపిస్తున్నాయి. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను దోషిగా తేలుస్తూ సీబీఐ కోర్టు నేడు తీర్పును వెలువరించింది. ఈ దాణా స్కాంకు సంబంధించి ఆర్జేడీ చీఫ్‌కు వ్యతిరేకంగా సీబీఐ కొన్నేళ్ల కిందటే ఐదు కేసులను నమోదుచేసింది. దానిలో మొదటి కేసులో లాలూ దోషిగా తేలడంతో ఐదేళ్ల జైలుశిక్ష, రూ.25 లక్షల జరిమానా విధించారు. జైలుశిక్ష నేపథ్యంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అప్పట్లో తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అంతేకాక ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా 11 ఏళ్ల పాటు అనర్హత వేటు వేసింది.

అనంతరం ఆయన 2013లో బెయిల్‌పై బయటికి వచ్చినప్పటికీ.. ప్రస్తుతం మరోసారి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. నేడు వెలువరిచిన తీర్పులో కూడా లాలూను దోషిగానే తేల్చుతూ సీబీఐ కోర్టు మరోసారి తీర్పునిచ్చింది. ఈ కేసులో జనవరి 3ను తీర్పును వెలువరచనుంది. యూపీఏ-1 ప్రభుత్వం(2004-09)లో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు, బిహార్‌ ముఖ్యమంత్రిగా(1990-97) ఉన్నప్పుడు లాలూ పలు అక్రమాలకు పాల్పడ్డారు. ఈ అక్రమాలపై పలు కేసులు నమోదుచేసిన ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీలు లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు చుక్కలు చూస్తున్నాయి. 
 

అక్రమాస్తుల కేసు
1998లో అక్రమాస్తుల కేసులో లాలూకు వ్యతిరేకంగా కేసు నమోదైంది. ప్రభుత్వ ట్రెజరీ నుంచి రూ.46 లక్షలకు లాలూ తన ఖాతాలోకి వేసుకున్నారని ఆదాయపు పన్ను శాఖ ఆరోపించింది. ఆయన భార్య రబ్రీ దేవికి కూడా దీనిలో పాలు పంచుకున్నారని పేర్కొంది. 2000లో వీరిద్దరూ సీబీఐ కోర్టుకు సరెండర్‌ అయ్యారు. ఆ సమయంలో రబ్రీదేవి సీఎంగా ఉన్నారు. వెంటనే ఆమెకు బెయిల్‌ లభించింది. అనంతరం లాలూకి కూడా పాట్న హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.  

ఐఆర్‌సీటీసీ కేసు
2006లో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రాంచి, పురి ప్రాంతాల్లోని రైల్వేకు చెందిన హోటళ్ల టెండర్ల విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఏజెన్సీ రిపోర్టులు నివేదించాయి. ఐఆర్‌సీటీసీ స్కామ్‌గా ఈ కేసు ప్రాచుర్యంలోకి వచ్చింది. 2004లో యూపీఏ ప్రభుత్వం లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వియాదవ్‌, ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌లపై సీబీఐ కేసు కూడా నమోదుచేసింది. 

మనీలాండరింగ్‌ కేసు
లాలూ కూతురు మిశా భారతి, ఆమె భర్త శైలేష్‌ కుమార్‌లపై మనీ లాండరింగ్‌ కేసు నమోదైంది. వీరికి చెందిన మిస్‌ మిశాలి ప్రింటర్స్‌, ప్యాకర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మనీ లాండరింగ్‌ యాక్ట్‌ 2002ను ఉల్లంఘించినట్టు ఆరోపణలున్నారు. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ చేస్తున్నాయి. నేడు దాణా కేసు తీర్పు వెలువడానికి కాస్త ముందుగా లాలూ కూతురు మిశా భారతి, ఆమె భర్తపై మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఛార్జ్‌షీటు కూడా దాఖలు చేసింది. అంతేకాక అంకతముందే వీరిపై ఆదాయపు పన్ను శాఖ బినామి లావాదేవీల చట్టాన్ని ప్రయోగించింది. ఢిల్లీ, పాట్నాలో ఉన్న లాలూ ప్రసాద్ కుటుంబానికి చెందిన 9 కోట్లకు పైగా విలువైన భూములు, ప్లాట్లు, భవంతులను ఆస్తులను ఈ యాక్ట్ కింద అటాచ్ మెంట్ చేస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీచేసింది.

తేజ్‌ ప్రతాప్‌
2015 అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా దాఖలు చేసిన అఫిడ్‌విట్‌లో లాలూ కొడుకు తేజ్‌ ప్రతాప్‌ తను కలిగి ఉన్న భూమి వివరాలను దాచిపెట్టాడని ఇటీవలే ఆయనపై కూడా కేసు నమోదైంది. 2017 సెప్టెంబర్‌లో బీజేపీ ఎంఎల్‌సీ నందన్‌ ప్రసాద్‌ ఈ కేసు దాఖలు చేశారు. 

మరిన్ని వార్తలు