సమన్వయంతో ముందుకెళ్తాం: భట్టి

22 Sep, 2018 03:04 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్లతోపాటు యువత అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకుని సమన్వయంతో ముందుకు వెళ్తామని ఆ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగస్ఫూర్తితో ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రజా ప్రభుత్వం త్వరలో ఏర్పడబోతోందన్నారు. ప్రజలకు, ఫ్యూడలిస్టులకు మధ్య జరిగే పోరులో అంతిమంగా ప్రజలే విజయం సాధిస్తారని అన్నారు.

ప్రచార కమిటీ చైర్మన్‌గా తనను ఎంపిక చేసిన పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్‌ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రజల ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన అన్ని వర్గాల ప్రజలు సొంత రాష్ట్రంలో నిరాశతో ఉన్నా రని గుర్తు చేశారు. ప్రాజెక్టుల రీ డిజైన్‌ పేరుతో ఒక్క చుక్కనీరు కూడా పంట పొలాలకు రాకుం డా చేసిన ఘనత టీఆర్‌ఎస్, కేసీఆర్‌కే దక్కు తుందని భట్టి విమర్శించారు. 

మరిన్ని వార్తలు