మమత కేబినెట్‌ నుంచి ముగ్గురు మంత్రులు ఔట్‌

6 Jun, 2018 11:42 IST|Sakshi
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (ఫైల్‌ ఫొటో)

కోల్‌కతా : తన కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులను బాధ్యతల నుంచి తొలగించినట్టు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చురామణి మహతో, గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి జేమ్స్‌ కుజుర్‌, అబానీ జోర్దార్‌లను  కేబినెట్‌ పదవుల నుంచి తప్పించినట్టు ప్రకటించారు. వచ్చే  ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు వీరిని సేవలను వాడుకుంటామని చెప్పారు. ఈ ముగ్గురు మంత్రులు.. ముఖ్యమంత్రికి తమ రాజీనామా లేఖలు పంపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించినప్పటికీ.. కొన్నిచోట్ల బీజేపీకి ఓట్ల శాతం పెరగటం మమతను కలవరపెడుతోందని పార్టీ అంతర్గత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే 2019 లో​క్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ వ్యవస్థాపక కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు, పార్టీ వ్యవహారాలపై దృష్టిసారించేందుకు ఆ ముగ్గురిని మంత్రి బాధ్యతల నుంచి తప్పించారు.

మీరేమీ బాధపడొద్దు...
కేబినెట్‌ నుంచి ముగ్గురు మంత్రులను తొలగించిన నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న మమత విలేకరులతో మాట్లాడారు. తొలగించిన మంత్రుల స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఆ అంశం పూర్తిగా మా పరిధిలో ఉండేదే. మాకున్న అధికారంతో ఏమి చేయాలో మేము నిర్ణయించుకుంటాం. ఈ విషయమై మీరెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ’ మమత సమాధానమిచ్చారు. 

మరిన్ని వార్తలు