ముందస్తుకు వెళ్తే కోర్టుకే: శశిధర్‌రెడ్డి

1 Sep, 2018 02:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగ సవరణలతో ముడిపడి ఉన్న పలు కీలక సమస్యలను పరిష్కరించకుండా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడంతో అక్కడి ప్రజలకు ఏ నియోజకవర్గాల్లో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు.

గతంలో 3 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో వారున్నారని, మరిప్పుడు ఆ నియోజకవర్గాలను ఏ విధంగా నోటిఫై చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచేందుకు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ తీరుపై ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ముందస్తుకు వెళ్లే ముందు పోలవరం ముంపు మండలాల పరిస్థితి తేల్చాలని, ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు