ఛత్తీస్‌గఢ్‌లో అజిత్‌ జోగీతో బీఎస్పీ జట్టు

21 Sep, 2018 05:04 IST|Sakshi
మీడియా సమావేశంలో అజిత్‌ జోగి, మాయావతి

లక్నో: ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) కాంగ్రెస్‌కు షాకిచ్చింది. ఈ ఎన్నికల్లో అజిత్‌ జోగీ నేతృత్వంలోని జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌(జేసీసీ)తో కలిసి పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ విషయమై బీఎస్పీ అధినేత్రి మాయావతి లక్నోలో మాట్లాడుతూ.. ‘జేసీసీతో పొత్తు కుదుర్చుకోవాలని మేం నిర్ణయించుకున్నాం. అజిత్‌ జోగీ మా కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారు. మొత్తం సీట్లలో జేసీసీ 55 చోట్ల, బీఎస్పీ 35 సీట్లలో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది. గౌరవప్రదమైన సీట్లు ఇచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు మాకు అభ్యంతరం లేదు’ అని తెలిపారు. తమ కూటమి బీజేపీని గద్దె దించగలదని ఆమె వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు