భీం ఆర్మీది ఓట్ల రాజకీయం : మాయావతి 

22 Dec, 2019 12:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భీం ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాడని బీఎస్పీ అధినేత మాయావతి మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా చంద్రశేఖర్‌ ఆజాద్‌ శనివారం ఢిల్లీలోని జామా మసీదు నుంచి జంతర్‌ మంతర్‌ వరకు ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ముందస్తు అనుమతిని పోలీసులు  నిరాకరించినా ర్యాలీ నిర్వహించడంతో శనివారం ఉదయం జామా మసీదు వెలుపల చంద్రశేఖర్‌ ఆజాద్‌ను పోలీసులు ఆరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆయన్ను 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగించింది. తర్వాత ఆజాద్‌ను తీహార్‌ జైలుకు తరలించారు.

ఈ పరిణామాలపై మాయావతి ఆదివారం ట్విటర్‌లో స్పందించారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఢిల్లీలో నిరసన తెలపాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందునే ఓటర్లను ప్రభావితం చేయడానికి అనుమతి లేకున్నా ర్యాలీ నిర్వహించి కావాలని అరెస్ట్‌ అయ్యారని మాయావతి విమర్శించారు. ఇలాంటి స్వార్థపూరిత వ్యక్తులు, సంస్థలు, పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని  ప్రజలను, బీఎస్పీ పార్టీ కార్యకర్తలను మాయావతి హెచ్చరించారు. చదవండిభీమ్‌ ఆర్మీ చీఫ్‌ ఆజాద్‌ అరెస్ట్‌

మరిన్ని వార్తలు