‘బాబు అనుకూల మీడియా సమాధానం చెప్పాలి’

22 Dec, 2019 12:12 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అనుకూల మీడియా సపోర్ట్‌ చేస్తోందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు సి రామచంద్రయ్య విమర్శించారు. అభివృద్ధిని సమతుల్యం చేయాలన్నదే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిపై నిపుణల కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చిందన్నారు. జీఎన్‌ రావు కమిటీ 13 జిల్లాలో పర్యటించి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సూచనలు చేసిందని తెలిపారు. జీఎన్‌ రావు కమిటీ ప్రతిపాదనలనే సీఎం వైఎస్‌ జగన్‌ ప్రస్తావించారని అన్నారు. పాలనలో దూరదృష్టితోనే సీఎం వైఎస్‌ జగన్‌ ముందుకెళ్తున్నారని చెప్పారు.

రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరేలా సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబులో మార్పు రాలేదని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు రాజమౌళి గ్రాఫిక్స్‌ చూపించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఏం చేసినా స్వప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. 13 జిల్లాల రాష్ట్రానికి గ్రాఫిక్స్‌ రాజధాని అవసరమా అని ప్రశ్నించారు. లక్ష కోట్లతో రాజధాని నిర్మించాలనుకోవడాన్ని ఎలా సమర్థిస్తారని నిలదీశారు. దీనికి చంద్రబాబుకు అనుకూల మీడియా సమధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి మంచి జరిగేటప్పుడు అందరు సమర్థించాలని అన్నారు. సీఎం​ వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు వన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేశారని.. ఆయన మైండ్‌ మార్చుకోకపోతే టీడీపీ మరింత దిగజారుతుందని విమర్శించారు. రైతులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని.. సీఎం వైఎస్‌ జగన్‌ కచ్చితంగా న్యాయం చేస్తారని భరోసా కల్పించారు.

మరిన్ని వార్తలు