‘బ్లూ ఫ్రాగ్‌..అదో ఎల్లో ఫ్రాగ్‌’

14 Nov, 2019 20:33 IST|Sakshi

మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, విశాఖపట్నం: బ్లూ ఫ్రాగ్‌ అక్రమాల వెనుక పాత్రధారులెవరో త్వరలోనే తెలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..బ్లూ ఫ్రాగ్‌..అదో ఎల్లో ఫ్రాగ్‌ అని ... పక్కింటికి కన్నాం వేయాలని సొంతింటికే కన్నాం వేసుకున్నారన్నారు. మన శాండ్‌ అనేది పాత వెబ్‌సైట్‌ అని పేర్కొన్నారు. ఇసుకతో చనిపోయిన పార్టీని బతికించుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రాజకీయాల కంటే ప్రజల గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారని’ తెలిపారు. కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించే క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనను ప్రవేశపెట్టాలని సీఎం నిర్ణయించారని చెప్పారు.

నాడు దోపిడీ..నేడు కొంగ జపం..
చంద్రబాబుకు పనిలేక ఇసుక,ఇంగ్లీష్‌ను పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో ఇసుక, బూడిదను కూడా దోచుకున్నారని..ఇప్పుడు కొంగ జపం చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల సొమ్ము దోచుకున్న టీడీపీ నేత అచ్చెన్నాయుడితో పవన్‌ కల్యాణ్‌ లాంగ్‌ మార్చ్‌ చేయడం దారుణమన్నారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక లభ్యత పెరిగిందని, ఇప్పుడు విశాఖలో 30వేల టన్నులు ఇసుక అందుబాటులో ఉందని వెల్లడించారు. బుక్ చేసిన రెండు గంటల్లోనే ఇసుక లభించనుందని పేర్కొన్నారు. జిల్లాలోని  అచ్యుతాపురం, ఆనందపురం లో ఇసుక డిపోలు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పారదర్శక పాలన అందిస్తోందని కన్నబాబు చెప్పారు.

 
 

మరిన్ని వార్తలు