సీనియారిటీ కాదు..సిన్సియారిటీ ముఖ్యం

28 Sep, 2019 04:45 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ నేతలు కర్నె, జీవన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయాల్లో అనుభవంకన్నా చిత్తశుద్ధి ముఖ్యమని, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి.. కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్, అసెంబ్లీ పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ నైతిక విలువలను పాటించే నేతలను మాత్రమే ప్రజలు అనుసరిస్తారని, వెన్నుచూపి పారిపోయి విలువల గురించి మాట్లాడేవాళ్లను పట్టించుకోరని ఉత్తమ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటమి పాలైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన ఆయన.. ఆ తర్వాత మాట నిలబెట్టుకోలేదన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఉత్తమ్‌ దుష్ప్రచారం చేస్తున్నారని కర్నె, జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు. శాసన మండలి చైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డిపై ఫిర్యాదు చేస్తామంటూ ఉత్తమ్‌ చేసిన ప్రకటనలను పబ్లిసిటీ స్టంట్‌గా కొట్టిపారేశారు.

మరిన్ని వార్తలు