అధికారం కోసం కూటమి పెట్టుకునే నీచ రాజకీయం సీఎం చంద్రబాబుది
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
నగరి/వేంపల్లె: కేటీఆర్తో సంప్రదింపులు ఫెడరల్ ఫ్రంట్ కోసమే అని ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో గురువారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అలాగే వైఎస్సార్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిలోని ఆంజనేయస్వామిని దర్శింకున్న అనంతరం ఆమె వేంపల్లెలో విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంప్రదింపులపై టీడీపీ నాయకులు చేసిన విమర్శలపై ఆమె విరుచుకుపడ్డారు. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు టీడీపీ వారికి ఎప్పుడూ ఎవరితో పొత్తు పెట్టుకుంటాం, ఎవరిని ఏమార్చి అధికారం చేజిక్కించుకోవాలన్న ఆలోచనే ఉంటుందని ధ్వజమెత్తారు.
అందుకే జగనన్న ఎవరితో మాట్లాడినా వారికి పొత్తు ఆలోచనే వస్తుందన్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు జగనన్న చేసేది ప్రతిదీ తప్పు అని చెప్పడమే అలవాటుగా పెట్టుకున్నారన్నారు. 40 యేళ్ల రాజకీయ అనుభవం ఉందని గొప్పగా చెప్పుకునే ఆయనకు ఫెడరల్ ఫ్రంట్ ఎందుకు పెడతారో తెలియదా అన్నారు. కాంగ్రెస్, బీజేపీ దేశానికి అన్యాయం చేసిన పార్టీలని వాటిపై పోరాడేందుకు ఫెడరల్ ఫ్రంట్ పెట్టడంలో తప్పేంటన్నారు. విశ్వసనీయత, భావసారూప్యత ఉన్న పార్టీలు కలిసి పనిచేయడం ఎక్కడైనా జరుగుతుందని అందుకే పార్టీ అధ్యక్షుని హోదాలో జగన్మోహన్ రెడ్డిని కేటీఆర్ కలిసారన్నారు.
దీనికి టీడీపీ నాయకులు పెడర్దాలు తీస్తున్నారన్నారు. వారు కలిస్తే పచ్చ నేతలకు వణుకెందుకు పుడుతోందన్నారు. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్, కేటీఆర్లు పిలవడమే కాకుండా శిలాఫలకంపై పేరును చెక్కించడం మీరంతా ఆ రోజు ప్రశ్నించకుండా గాడిదలు కాస్తున్నారా అని ధ్వజమెత్తారు. రామోజీరావును కలిసినప్పుడూ ఇలాగే రాద్ధాంతం చేశారన్నారు. ఓటుకు కోట్లు కేసులో కేసీఆర్ కాళ్లు పట్టుకొని దొంగలా విజయవాడకు పారిపోయింది ఎవరో ప్రజలందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు వియ్యంకుడు కేటీఆర్ను కలవచ్చు, అందరికీ నీతులు చెప్పే పవన్ కళ్యాణ్ కలిస్తే తప్పులేదు.. జగనన్న కలిస్తే తప్పొచ్చిందా అన్నారు.
తెలంగాణలో కేసీఆర్తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించింది మీరుకాదా అని ప్రశ్నించారు. హరికృష్ణ మృతదేహం వద్ద కూడా రాజకీయం చేశారని, కేసీఆర్ ఛీ పొమ్మంటే కాంగ్రెస్ పార్టీతో కలిసారన్నారు. జగన్మోహన్ రెడ్డి దమ్ము గురించి టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన దమ్ము, సత్తా ఏంటో మీకు, సోనియాగాంధీకి తెలుసు అన్నారు. ఓటమి భయం పట్టుకున్న చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామిలు అమలు చేయకపోతే టీడీపీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారని హెచ్చరించారు.