‘అంతా ఆల్‌రైట్‌.. సమయం వచ్చినప్పుడు చెబుతా’

23 Jul, 2018 15:57 IST|Sakshi
జేసీ దివాకర్‌ రెడ్డి

సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అలక, రాజీ నామా డ్రామాకు తెరపడినట్లయింది. సోమవారం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతిలో కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సూచన మేరకు సీఎంఓ అధికారులను కలిశానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

‘ప్రస్తుతం అంతా ఆల్‌రైట్‌, రాజీనామాపై సమయం వచ్చినప్పుడు చెబుతాను. ఈ దేశంలో ఎవరి మీద అలగలేం. అలిగితే ప్రయోజనం ఉండదు. పార్లమెంట్‌కు వెళ్లకపోవడానికి నేను అలగడం లాంటిది ఏమి లేదు’ అంటూ పార్లమెంట్‌కు వెళతానంటూ జేసీ హింట్‌ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రితో ఏం మాట్లాడారో చెప్పడానికి ఆయన నిరాకరించారు. రాజకీయ వాతావరణం బాగాలేదు అన్న మాటకు కట్టుబడి ఉన్నానన్నారు.

నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం పోరాటం చేయాల్సిందేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చెయ్యలేదు కానీ ఇప్పుడు చేస్తానంటే ఎవరూ నమ్ముతారని ఎద్దేవా చేశారు. ప్రజలు సంతోషం కోసమే తన పోరాటమని జేసీ దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా తాను పార్లమెంట్‌కు వెళ్లనని జేసీ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జేసీతో మాట్లాడి సర్దిచెప్పారు. అనంతరం జేసీ ఢిల్లీ వెళ్లారు. 

మరిన్ని వార్తలు