డిలీట్‌ చేయ్‌.. ప్రాణాలు తీస్తా

27 Mar, 2019 18:58 IST|Sakshi

సాక్షి, హిందూపురం: సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి చిందులు తొక్కారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బాలయ్య తన స్వరూపాన్ని బయటపెట్టారు. ఒక మీడియా ప్రతినిధిపై రౌడీయిజం ప్రదర్శించారు. ‘ప్రాణాలు తీస్తా’ అంటూ ఒంటికాలిపై లేచారు. బాలకృష్ణ వస్తున్నప్పుడు చిన్నపిల్లలను ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది పక్కకు లాగిపడేశారు. దీన్ని షూట్‌ చేసిన మీడియా ప్రతినిధిపై దౌర్జన్యం చేసి, రాయకూడని భాషలో బూతులు తిట్టారు. కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలను తొలగించాలని చేయి చేసుకున్నారు.

‘రాస్కెల్‌ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా. నరికి పోగుపెడతాను, ప్రాణాలు తీస్తాను. బాంబులు వేయడం​ కూడా తెల్సు నాకు. కత్తి తిప్పడం కూడా తెల్సు’ అంటూ బాలయ్య బెదిరిస్తున్న దృశ్యాలు వీడియోలో రికార్డైయ్యాయి. చుట్టూ ఉన్నవారు కూడా ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మీడియా ప్రతినిధిపై బాలకృష్ణ దౌర్జన్యాన్ని జర్నలిస్ట్‌ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సభ్య సమాజం తలదించుకొనేలా ప్రవర్తించిన తీరును ప్రతిపక్ష పార్టీలు గర్హించాయి. ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని, పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశాయి.

బాలయ్యను చూసి భయపడుతున్నారు
ఎన్నికల సంఘం బాలకృష్ణ మానసిక పరిస్థితి పరిగణనలోకి తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్బాల్‌ అహ్మద్‌ఖాన్‌ కోరారు. హిందూపురానికి చుట్టపు చూపుగా వచ్చిపోయే బాలకృష్ణను చూసి ఇక్కడి ప్రజలు వణికిపోతున్నారని చెప్పారు. ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియక స్థానికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే నిరాశ, నిస్పృహతో ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు