మమతపై ఒవైసీ ఫైర్‌

20 Nov, 2019 04:03 IST|Sakshi

కోల్‌కతా: మైనారిటీల్లో అతివాదాన్ని పెంచుతోందంటూ ఏఐఎంఐఎంను ఉద్దేశించి పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ అధినేత మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ ఘాటుగా స్పందించారు. తృణమూల్‌ చీఫ్‌ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముస్లింలు ఘోరంగా వెనుకబడిపోయారని దుయ్యబట్టారు. సోమవారం కూచ్‌ బెహర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమత మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న ఓ పార్టీ.. సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తోంది. ఇటువంటి అతివాద శక్తుల మాటలు మైనార్టీలు వినొద్దు. నమ్మొద్దు..’ అంటూ ఎంఐఎం పేరును ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఒవైసీ మంగళవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. ‘ఆమె అహంకారంతో అర్థం లేని నిరాధారమైన ప్రకటనలు చేస్తున్నారు. ఆమెకు ఓటు వేసిన ముస్లింలందరినీ కించపరిచారు’అని అన్నారు. తృణమూల్‌ చీఫ్‌ మాటలు వింటుంటే ఆ రాష్ట్రంలో ఎంఐఎం ఎంత బలంగా ఎదిగిందో తెలుసుకోవచ్చన్నారు.

మరిన్ని వార్తలు