సాక్షి టాస్క్ఫోర్స్: బీకే పార్థసారథిని పెనుకొండ ఎంతగానో ఆదరించింది. బీసీ వర్గమని ఓటర్లంతా నెత్తినపెట్టుకుని తిరిగారు. తమ సమస్యలు తీరుస్తాడన్న ఆశతో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, అంతకుమునుపు జెడ్పీ చైర్మన్గా ఎన్నికయ్యేందుకు ఎంతగానో సహకరించారు. కానీ ఆయన మాత్రం సొంత లాభమే ఎక్కువగా చూసుకున్నారు. ప్రజా సమస్యలు గాలికొదిలారు. పైగా ఎవరైనా ప్రశ్నిస్తే బూతు పురాణం వినిపిస్తున్నారు. 2014లో ఎన్నికైన తర్వాత ఆయన వ్యవహార శైలి మరీ దారుణంగా మారింది. ధనార్జనే ధ్యేయంగా తన ఆస్తులను పెంచుకుంటూ రూ.కోట్లకు పడగలెత్తారు. అక్రమ సంపాదనతో అహం పెరిగి ప్రజా సమస్యలపై ప్రశ్నించే విపక్ష పార్టీల నాయకులను దూషించడం, ప్రజలను చులకనగా మాట్లాడటంతో జనమంతా ఆయనంటేనే ఈసడించుకుంటున్నారు.
చివరకు సొంత పార్టీ నేతలను సైతం రాయలేని పదజాలంతో దూషిస్తుండటంతో చాలా మంది సీనియర్లు ఆయన వెంట వెళ్లేందుకు కూడా ఇష్టపడని పరిస్థితి నెలకొంది. తన అల్లుడి ద్వారా నియోజకవర్గంలో సొంత కోటరీ ఏర్పాటు చేసుకుని సొంత పార్టీలోని సీనియర్లను తీవ్రంగా అవమానించారు. ఇప్పటికే కొందరు పార్టీ వీడగా...మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పాత్రికేయులనూ వదలని బీకే
పెనుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వైఫల్యాలు, అవినీతిపై కథనాలు రాసిన విలేకరులను సైతం బీకే నోరుచేసుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. నోటికి అంతూపంతూ లేకుండా ఆయన వినిపించే బూతుపురాణం వింటే ఎవరైనా ఇతనో ఎమ్మెల్యేనా అని అనుమానిస్తారు.
‘‘ఏయ్ ఎస్ఐ.. ఈ నా కొడుకులను పోలీస్స్టేషన్లో ఉంచి మక్కిలు విరిగేలా తన్ను’’
- నీటి సమస్యలపై నిలదీసిన పెనుకొండ మండలం కొండంపల్లి సీపీఐ నాయకులనుద్దేశించి బీకే పార్థసారథి చేసిన వ్యాఖ్యలివి.
‘‘ఏయ్ సీఐ.. ఆ లం..కొడుకును.. ఎవరు రోడ్డుపై ధర్నా చేయమన్నారు. మొదట ఆ లం..కొడుకును చెప్పుతో కొట్టి పోలీస్స్టేషన్లో పెట్టి నాన్బెయిలబుల్ కేసులు నమోదు చెయ్...’’
- ప్రత్యేక హోదాపోరుకు మద్దతు తెలపాలని ఎమ్మెల్యే కాన్వాయ్ అడ్డుకున్న సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ నేతలనుద్దేశించి అప్పటి సీఐ శ్రీనివాసులుతో ఎమ్మెల్యే అన్న మాటలివి.
బీకే దూషణల పర్వంలో మచ్చుకు కొన్ని..