అది రైతులకు అవమానం

29 Apr, 2019 03:17 IST|Sakshi
బహ్రెయిచ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సావిత్రీబాయితో ప్రియాంక

పీఎం–కిసాన్‌ పథకంపై ప్రియాంకాగాంధీ విమర్శలు

బహ్రైచ్‌: కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, తూర్పు ఉత్తరప్రదేశ్‌ ఇన్‌చార్జి ప్రియాంకా గాంధీ ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీ అమలు చేస్తున్న పీఎం–కిసాన్‌ పథకంపై విరుచుకుపడ్డారు. వాస్తవానికి ఈ పథకంతో బీజేపీ రైతులను అవమానిస్తోందన్నారు. ప్రధాని మోదీ గొప్పగా ప్రకటించుకున్నప్పటికీ ఈ పథకం ద్వారా రైతులకు అందుతున్నది రోజుకు రూ.3.50 మాత్రమే, ఇది ముమ్మాటికి రైతులను అవమానించడమే అని ఆమె అన్నారు. బీజేపీ ఎప్పుడూ జాతీయవాదం గురించి ప్రస్తావిస్తుందనీ, నిజానికి రైతులు, ప్రజల సమస్యలు వినడం, వాటికి పరిష్కారం చూపడమే నిజమైన జాతీయవాదం అని తాను భావిస్తున్నానని అన్నారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా బహ్రైచ్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్న సావిత్రిభాయ్‌ పూలే తరఫున ప్రియాంక ప్రచారం చేశారు. జాతీయవాదం గురించి ప్రధాని పదేపదే తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తుంటారని, ప్రజలు కష్టాలు పరిష్కరించడమే నిజమైన జాతీయవాదంగా తాను భావిస్తానని, స్వోత్కర్షపైనే ఎప్పుడూ మోదీ దృష్టిసారిస్తారనిఅన్నారు.

మరిన్ని వార్తలు