రాహుల్‌తో సిద్ధూ కీలక భేటీ..!

10 Jun, 2019 14:19 IST|Sakshi

పంజాబ్‌ సీఎంపై తీవ్ర అసంతృప్తి

చండీగఢ్‌: మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ సోమవారం కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర​సింగ్‌ ఇటీవల చేపట్టిన మంత్రివర్గం విస్తీరణతో సిద్ధూ తీవ్ర అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే. దీంతో గత గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశానికి డుమ్మా కొట్టారు .పార్టీకి సిద్ధూ రాజీనామా చేస్తారు అనే వార్తలు కూడా వినిపించాయి.  ఈ నేపథ్యంలో రాహుల్‌తో  భేటీ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి గురించి రాహుల్‌కు వివరించినట్లు సమాచారం. అంతేకాకుండా తనకు ప్రాధాన్యత లేని శాఖను కేటాయించారని రాహుల్‌ వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్ధూకు పార్టీలో మరింత ప్రాధాన్యం కల్పిస్తామని రాహుల్‌ మాటిచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్‌తో సమావేశంలో ప్రియాంక గాంధీ, పార్టీ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కూడా పొల్గొన్నారు. 

అయితే కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తీరుపై గతకొంత కాలంగా సిద్ధూ తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్‌ మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులకు ఉద్దేశించి.. సీఎం అమరీందర్‌ కేబినెట్‌ సమావేశం నిర్వహించగా.. దానికి హాజరుకాకుండా సిద్ధూ తన అసమ్మతిని తెలియజేశారు. ఈ క్రమంలో సిద్ధూకు అమరీందర్‌ సింగ్‌ షాక్‌ ఇచ్చారు. సిద్ధూ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలలో కీలకమైన స్థానిక సంస్థల శాఖను తొలగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో సిద్ధూ కేవలం పర్యాటకం, సాంస్కృతిక శాఖకు పరిమితమయ్యారు. 

తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి కాంగ్రెస్‌ నేతలైన అమరీందర్‌, సిద్ధూల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. అమరీందర్‌ నేతృత్వంలో ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) భేటీలోనూ సిద్ధూ పాల్గొనలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షకు ఉద్దేశించిన ఈ సమావేశంలో సిద్ధూ పనితీరుపై అమరీందర్‌ ఘాటు విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి చేదు ఫలితాలు రావడానికి సిద్ధూ అసమర్థతే కారణమని ఆయన నిందించారు.

>
మరిన్ని వార్తలు