రేపు చత్తీస్‌గఢ్‌, రాజస్ధాన్‌ సీఎంల ఎంపిక

11 Dec, 2018 17:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మూడు రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన మెజారిటీకి చేరువైన కాంగ్రెస్‌ సంబరాల్లో మునిగితేలుతోంది. రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లో సాధారణ మెజారిటీ సాధించేలా దూసుకుపోతున్న కాంగ్రెస్‌ మధ్యప్రదేశ్‌లోనూ మేజిక్‌ మార్క్‌కు చేరుకుంది. ఇక చత్తీస్‌గఢ్‌, రాజస్ధాన్‌లో ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రయత్నాలు వేగవంతం చేసింది.

చత్తీస్‌గఢ్‌, రాజస్దాన్‌లో ఆ పార్టీ తరపున నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రాయ్‌పూర్‌, జైపూర్‌లలో బుదవారం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభా పక్ష నేతలను ఎన్నుకోనున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్ధులను వీరు లాంఛనంగా ఎన్నుకునే అవకాశం ఉంది. చత్తీస్‌గఢ్‌లో పీసీసీ చీఫ్‌ భూపేష్‌ భాగల్‌ సీఎం రేసులో ముందుండగా, రాజస్ధాన్‌లో సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌, యువ నేత సచిన్‌ పైలట్‌లు సీఎం పదవికి పోటీ పడనున్నారు.

ఇక ఎన్నికల ఫలితాల్లో రాజస్ధాన్‌లో 199 స్ధానాలకు గాను మేజిక్‌ మార్క్‌ను దాటిన కాంగ్రెస్‌ పార్టీ 102 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, పాలక బీజేపీ కేవలం 70 స్ధానాలకే పరిమితమైంది. చత్తీస్‌గఢ్‌లో 90 స్ధానాలకు గాను కాంగ్రెస్‌ మూడింట రెండొంతుల పైగా 63 స్ధానాల్లో ఆధిక్యత సాధించింది. ఇక్కడ బీజేపీ కేవలం 18 స్ధానాల్లోనే ముందంజలో ఉంది. 230 స్ధానాలున్న మధ్యప్రదేశ్‌లో మేజిక్‌ ఫిగర్‌కు అవసరమైన 116 స్ధానాలకు గాను కాంగ్రెస్‌ 117 స్ధానాల్లో ఆధిక్యం కనబరిచింది. బీజేపీ 103 స్ధానాల్లో బీఎస్పీ మూడు స్ధానాలు, ఇతరులు ఏడు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

మరిన్ని వార్తలు