రామ్‌లీలా మైదానానికి వాజ్‌పేయి పేరు!

25 Aug, 2018 15:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానానికి దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయి పేరు పెట్టాలంటూ ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. వాజ్‌పేయి సేవలకు గుర్తుగా ఈ పేరు మార్పు చేయాలని పేర్కొంది.

 93 ఏళ్ల వాజ్‌పేయి దీర్ఘకాలిక అస్వస్థత కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఈ నెల 16న కన్నుమూసిన సంగతి తెలిసిందే. దేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తమైంది.  కాగా వాజ్‌పేయి గౌరవార్థం రామ్‌లీల మైదానానికి ఆయన పేరు పెట్టాలని భావిస్తున్నట్టు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.
 
ప్రతి ఏడాది రామ్‌లీల ఉత్సవాలు జరిగే ఈ మైదానానికి విశేష ప్రాముఖ్యత ఉంది. రాజకీయ సభలు, ర్యాలీలు, ఉత్సవాలు, వినోదకార్యక్రమాలకు ఈ మైదానం వేదికగా నిలిచింది. ప్రధానమంత్రి గావాజ్‌పేయి ఇక్కడ అనేక సార్తు ప్రసంగించారు. ఆయన ప్రసంగాలు వినేందుకు జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. చత్తీస్‌గఢ్‌ నూతన రాజధాని కాబోయే కొత్త రాయ్‌పూర్‌ పేరును అటల్‌ నగర్‌గా నామకరణం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

కాగా రామ్‌లీలా మైదానం పేరు మార్పుపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. పేరు మార్చి బీజేపీ ఓట్లు దండుకోవాలని చూస్తోందని, అది సాధ్యం కాదన్నారు. బీజేపీకి ఓట్లు పడాలంటే మార్చాల్సింది మైదానం పేరు కాదని ప్రధాన మంత్రి పేరును మార్చాలని( నరేంద్రమోదీని తొలగించాలని) ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు