బీజేపీలో చేరిన రేవూరి ప్రకాశ్‌

5 Sep, 2019 03:51 IST|Sakshi
బీజేపీలో చేరిన రవీంద్రనాయక్, రేవూరిలతో కె.లక్ష్మణ్, మురళీధర్‌రావు

సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ సీనియర్‌ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌ బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆధ్వర్యం లో బుధవారం ఢిల్లీ వెళ్లిన నేతలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మురళీధర్‌రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించగా.. లక్ష్మణ్‌ పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మురళీధర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక పాలనపై పోరాడే సత్తా ఒక్క బీజేపీకే ఉందని, రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందనేందుకు నేతల వరుస చేరికలే నిదర్శనమని పేర్కొన్నారు. 

ఓర్వలేక తప్పుడు కేసులు: లక్ష్మణ్‌ 
రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి బీజేపీ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తోందని లక్ష్మణ్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కృత్రిమంగా యూరియా కొరత సృష్టించి కేంద్ర ప్రభుత్వంపై నెపంనెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తోందన్నారు. యూరియా డిమాండ్‌ను అంచనా వేయ డంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, వ్యవసా య ప్రణాళిక లేకపోవడంతో కరీంనగర్, నిజామా బాద్‌లో రైతులు ఆందోళన చేస్తున్నారని చెప్పారు. కాగా, టీడీపీని వీడి బీజేపీలో చేరే ముందు చంద్రబాబుతో మాట్లాడినట్టు రేవూరి తెలిపారు. రవీంద్రనాయక్‌ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో ప్రజల కలలు నెరవేరడం లేదన్నారు.  

మరిన్ని వార్తలు