సాక్షి, మీరట్ : యూపీలోని మీరట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా ప్రతినిధుల బాహాబాహీకి వేదికైంది. బీజేపీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు ఒకరిని ఒకరు తోసుకుంటూ పరస్పర దాడులకు పాల్పడ్డ వీడియో కలకలం రేపింది. మంగళవారం కౌన్సిల్ భేటీ సందర్భంగా ఇరు పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొని ఘర్షణకు దారితీసింది. సభ్యులు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడటంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని గాడినపెట్టాల్సి వచ్చింది.
మీరట్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ, బీఎస్పీ సభ్యుల మధ్య రగడ ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో వందే మాతరం గీతాలాపన విషయంలోనూ ఇరు పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ప్రజా ప్రతినిధులు కార్పొరేషన్లో అమర్యాదకరంగా వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.