సాక్షి, అమరావతి: కేంద్రం చొరవతోనే రాయలసీమకి డ్రిప్ ఇరిగేషన్ పథకం వచ్చిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గురువారం శాసన మండలిలో తెలిపారు. గురువారం మండలిలో ఇరిగేషన్పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నదుల అనుసంధానం మొదటగా బీజేపీయే ప్రవేశ పెట్టిందని అన్నారు. వాజ్పేయి ప్రభుత్వం 1998లోనే నదుల అనుసంధానం కోసం సురేష్ ప్రభు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశరని సోము వీర్రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్కి వరప్రసాదమైన పోలవరం ప్రాజెక్టు కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ముందుగానే కాలువలు తవ్వించారని వీర్రాజు పేర్కొన్నారు. పోలవరం మాదిరిగానే హంద్రీనీవా, తెలుగు గంగ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఓ వారం కేటాయించాలని సూచించారు. ముంపు మండలాలను ఆంధ్రలో కలపడానికి కారణం బీజేపీయేనని వీర్రాజు తెలిపారు. ఆ మండలాలను ఆంధ్రలో కలపకుంటే కేసీఆర్ పోలవరానికి అడ్డుపడేవాడని ఆయన అన్నారు.