-

మీ ఓటు మాదే..

18 May, 2019 03:14 IST|Sakshi

చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు ఊళ్లలో టీడీపీ నేతల దౌర్జన్యకాండ

పాతికేళ్లుగా దళితుల ఓట్లను తామే వేసుకుంటున్న వైనం

ప్రజాస్వామ్య హక్కు అణచివేత

ఏకపక్షంగా పోలింగ్‌ నిర్వహించుకుంటూ పెత్తనం

ఈ ఎన్నికల్లోనూ అదే పునరావృతం

సీసీ ఫుటేజీలతో వెలుగులోకి వచ్చిన చంద్రబాబు సామాజిక వర్గం ఆగడాలు

రీ పోలింగ్‌కు ఆదేశించడంతో తెలుగుదేశం పార్టీలో ఆందోళన

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి బెదిరింపులు

ప్రచారాన్ని మరోసారి అడ్డుకున్న టీడీపీ శ్రేణులు

సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో 25 ఏళ్లుగా దళితులు ఓట్లు వేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. ఏకపక్షంగా ఓట్లు వేసుకుంటూ తమ కత్తికి అడ్డే లేదని చెప్పుకుంటూ రెచ్చిపోతున్నారు. ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల్లోనూ దళితులను పోలింగ్‌ కేంద్రాల వద్దకు రాకుండా అడ్డుకుని టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్‌ చేసుకున్నారు. సీసీ ఫుటేజిల రిగ్గింగ్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఎన్నికల సంఘం కొరడా  ఝులిపించింది. చంద్రగిరి పరిధిలోని ఐదు గ్రామాల్లో ఈనెల 19న రీ పోలింగ్‌కు ఆదేశించటంతో టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రీ పోలింగ్‌ జరగనుందనే అక్కసుతో దళితులపై, వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై దాడులకు తెగబడుతున్నారు.  

సీఎం సామాజిక వర్గానిదే పెత్తనం
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, కమ్మపల్లి, వెంకటరామాపురం, కొత్తకండ్రిగతోపాటు పాకాల మండలం పులివర్తివారిపల్లిలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారి కనుసన్నలోనే స్థానికులు నడుచుకోవాలి. వారి మాటను ధిక్కరిస్తే బతికి బట్టగట్టలేరంటూ దౌర్జన్యాలకు దిగుతుంటారు. 

ప్రజాస్వామ్యం ఖూనీ..
చంద్రబాబు రాజకీయాల్లోకి ప్రవేశించిన అనంతరం ఆయనకు అనుకూలంగా ఏకమైన సొంత సామాజిక వర్గం నేతలు టీడీపీకి వ్యతిరేకంగా ఎవరూ నోరెత్తకూడదని హుకుం జారీ చేశారు. ఫలితంగా రెండున్నర దశాబ్దాలుగా దళితులు, సామాన్యులు అక్కడ ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. టీడీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసేవారిని పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా అడ్డుకుంటూ వచ్చారు. ఏక పక్షంగా ఓటింగ్‌ నిర్వహించుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నట్లు కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు కూడా ఫిర్యాదులు అందాయి. 

వేల సంఖ్యలో ఫిర్యాదులు అందినా..
చంద్రగిరిలో 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసేందుకు ప్రయత్నించిన దళితులను టీడీపీ నేతలు అడ్డుకుని దాడులు చేశారు. ఎన్ని కుట్రలు చేసినా సీఎం చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజక వర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఘన విజయం సాధించారు. కనీసం 2019 ఎన్నికల్లోనైనా ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమకు అవకాశం కల్పించాలని కలెక్టర్‌ ప్రధ్యుమ్నకు దళితులు, సామాన్యులు పలుమార్లు విన్నవించారు. గ్రామాల్లో పర్యటించిన కేంద్ర ఎస్సీ, ఎస్సీ కమిషన్‌ బృందం వద్ద కూడా తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇలా వేలాది ఫిర్యాదులు ఆ గ్రామాల నుంచి వెళ్లాయి.

గ్రామస్తుల విన్నపం ఆలకించాలంటూ పలువురు అధికారులు కూడా నివేదికలిచ్చినా ఒరిగింది శూన్యం. గత నెల 11వతేదీన జరిగిన ఎన్నికల్లోనూ దళితులు తమ ఓటు హక్కు నియోగించుకోలేకపోయారు. ఆ ఐదు గ్రామాలతోపాటు రావిళ్లవారిపల్లి, ముంగళిపట్టు గ్రామాల్లోనూ దళితులు, సామాన్యులను పోలింగ్‌ కేంద్రం వద్దకు రాన్వికుండా టీడీపీ నేతలు నిరోధించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సైతం గ్రామంలోకి రాకుండా అడ్డగించారు. దళితులపై, ఎమ్మెల్యేపై, మీడియాపై, స్వతంత్ర అభ్యర్థులపైనా దాడులకు తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరుగుతున్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు.

టీడీపీకి అనుకూలంగా లేకుంటే బదిలీ వేటే
చంద్రగిరి పరిధిలోని ఐదు గ్రామాల్లో దళితులకు అనుకూలంగా నివేదికలు ఇచ్చిన వారిని టీడీపీ నేతలు కక్షగట్టి బదిలీ చేయిస్తుంటారు. గతంలో ఓ ఆర్డీవోపై ఇలాగే బదిలీ వేటు వేయించినట్లు సమాచారం. ఉన్నతాధికారులు ఏవైనా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలియగానే వారి  బదిలీ ఆర్డర్లు సిద్ధమవుతాయి. ఆ ఐదు గ్రామాలలో ప్రత్యేకంగా పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన ఓ తహశీల్దార్‌ను వారం తిరగకుండానే బదిలీ చేయించారు. ఓట్ల నమోదు సందర్భంగా అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించి అదనపు పోలింగ్‌ బూత్‌ల కోసం సిఫారసు చేసిన ఓ అధికారిని కూడా ట్రాన్స్‌ఫర్‌ చేయించారు. సిసోడియా ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా ఉండగా జరిపిన విచారణలో దళితులను ఓట్లు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నట్లు తేలింది. దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జాతీయ ఎస్సీ ఎస్టీ హక్కుల కమిషన్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చింది. 

వీడియో ఫుటేజ్‌తో వెలుగులోకి రిగ్గింగ్‌ 
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్య ధోరణిని గుర్తించిన ఈసీ చంద్రగిరి పరిధిలోని ఏడు పోలింగ్‌ కేంద్రాలను అతి సున్నిత కేంద్రాలుగా నోటిఫై చేసింది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించాలని ఆదేశించింది. వెబ్‌కాస్టింగ్‌ రికార్డు చేయాలని సూచించింది. చంద్రగిరిలో పోలింగ్‌ రోజు జరిగిన దౌర్జన్యాలపై ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడంతో వెబ్‌ కాస్టింగ్‌ వివరాలను అందజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో జిల్లా అధికారులు రంగంలోకి దిగి అంతా సక్రమంగానే ఉందంటూ ఈసీకి నివేదిక ఇచ్చారు. దీనిపై అనుమానం రావడంతో వీడియో పుటేజ్‌తో కూడిన నివేదిక సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో రిగ్గింగ్‌ బాగోతం బయటకు వచ్చింది. వెబ్‌కాస్టింగ్‌ రిపోర్టుతోపాటు గత ఎన్నికలలో ఓట్ల వివరాలను నేరుగా పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం రీ పోలింగ్‌కు ఆదేశించింది. దీంతో కలవరం చెందుతున్న టీడీపీ శ్రేణులు ఓటమి భయంతో విపక్షంపై మళ్లీ దాడులకు తెగబడుతున్నాయి.

అక్కడ పోలింగ్‌ ఏకపక్షం
చంద్రగిరి పరిధిలో పోలింగ్‌ సరళిను పరిశీలిస్తే టీడీపీ నేతలు ఆ ఐదు గ్రామాల్లో ఏ మేరకు రిగ్గింగ్‌ చేసుకున్నారనేది తెలిసిపోతుంది. 2014 ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ పార్టీ అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు 16 మంది పోటీ చేశారు. పోలైన ఓట్లను పరిశీలిస్తే టీడీపీకి అత్యధికంగా, వైఎస్సార్‌సీపీకి నామమాత్రంగా వచ్చాయి. ఇక్కడ రిగ్గింగ్‌ జరిగిందనే అనుమానం రాకుండా ఉండేందుకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి నామమాత్రంగా ఓట్లు వేయించినట్లు బోధపడుతోంది. మిగిలిన అభ్యర్థులెవరికీ ఒక్క ఓటు కూడా పోల్‌ కాకపోవడం రిగ్గింగ్‌ జరిగిందనటాన్ని రుజువు చేస్తోంది.

చెవిరెడ్డిపై మళ్లీ దౌర్జన్యం
ప్రచారాన్ని అడ్డుకునేందుకు టీడీపీ యత్నం 
తిరుపతి రూరల్‌: చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్‌ జరిగే గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని శుక్రవారం కూడా టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పార్టీ శ్రేణులతో కలసి ప్రచారానికి వెళ్లారు. ఆయన గ్రామంలోకి ప్రవేశించగానే టీడీపీ నాయకులు అడ్డుకునే యత్నం చేశారు. ‘మా ఊరిలో మీ ప్రచారం వద్దు... ఊరు నుంచి వెళ్లిపోండి’ అంటూ బెదిరింపులకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో చివరకు టీడీపీ నేతలు వెనక్కి తగ్గారు. అనంతరం చెవిరెడ్డి ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.

మరిన్ని వార్తలు