‘టీడీపీ మంత్రుల రాజీనామా ఓ డ్రామా’

7 Mar, 2018 23:47 IST|Sakshi
వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనేందుకే తెలుగుదేశం పార్టీ రాజీనామాల డ్రామాకు తెరలేపిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ సుబ్బారెడ్డి ఆరోపించారు. నాలుగేళ్లుగా కలసి కాపురం చేసిన టీడీపీ-బీజేపీలు ఏడాదిలో ఎన్నికలు ఉండగా డ్రామాకు తెరతీశాయని అన్నారు. నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగి రాష్ట్రానికి తెలుగుదేశం ఏం చేసిందని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా ఇవ్వబోమని బీజేపీ ముందే చెప్పిందని, అయినా అధికార కూటమిలో కొనసాగుతూ మంత్రులతో రాజీనామాలు చేయిస్తున్న తెలుగుదేశం పార్టీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్డీయేపై అవిశ్వాసం పెట్టి తీరుతుందని తేల్చిచెప్పారు. అనంతరం రాజీనమాలు చేస్తామని వెల్లడించారు.

బీజేపీతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జత కట్టబోతోందనే వార్తలను ప్రచారం చేసిందని టీడీపీనే అని చెప్పారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని తెలిపారు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే టీడీపీ ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించిందని అన్నారు.  

>
మరిన్ని వార్తలు