దమ్ముంటే చార్జిషీట్‌ వేయండి

4 Apr, 2018 11:56 IST|Sakshi
ఫైల్‌ఫోటో

సాక్షి, పాట్నా : పాలక బీజేపీకి దమ్ముంటే తనపై చార్జిషీట్‌ వేయాలని బీహార్‌ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ సవాల్‌ విసిరారు. బీహార్‌లో నితీష్‌ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న తేజస్వి యాదవ్‌ తాజగా ట్విటర్‌ వేదికగా బీజేపీ, నితీష్‌ కుమార్‌లను టార్గెట్‌ చేశారు. ‘నాపై చార్జిషీట్‌ నమోదు చేసేలా సీబీఐకి సూచించాలని నేను సుశీల్‌ కుమార్‌ మోదీ (బీహార్‌ డిప్యూటీ సీఎం)ని సవాల్‌ చేస్తున్నా’నని ట్వీట్‌ చేశారు. తనపై చార్జిషీట్‌ వేయాలని ఇప్పటివరకూ దేశంలో ఏ ఇతర నేతైనా కోరారా అంటూ తేజస్వి ప్రశ్నించడం గమనార్హం.

సీబీఐ పేరుతో రాజకీయాలు చేసేవారు నితీష్‌ కుమార్‌ వంటి వారిని బెదిరించాలని, తాను ఇలాంటి బెదిరింపులకు భయపడబోనని పాలక బీజేపీని హెచ్చరించారు. అరారియా, భాగల్పూర్‌, దర్భంగాల్లో ఇటీవల చెలరేగిన హింసాత్మక ఘటనలకు ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, బీజేపీలే బాధ్యత వహించాలని అన్నారు. తన తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రాణాలకు ముప్పుందని, ఆయనను అంతమొందించేందుకు బీజేపీ కుట్ర పూనుతోందని ఇటీవల తేజస్వి యాదవ్‌ ఆరోపించారు. 

మరిన్ని వార్తలు