ఏదేమైనా వారికి సాయం మరువం : హరీష్‌

3 Jan, 2020 16:47 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : ఆర్థికమాంద్యంతో ప్రభుత్వం వద్ద డబ్బులు లేకున్నా పేదవారికి సాయం చేయడంలో వెనకడుగు వేయమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు అన్నారు. అవసరమనుకుంటే మిగతా కార్యక్రమాలు వాయిదా వేసైనా గరీబోళ్లకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామంలో 2వ విడత పల్లెప్రగతి కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే రామలింగారెడ్డి, జడ్పీ చైర్మన్ రోజాశర్మ పాల్గొన్నారు. గోదావరి నీటితో చెరువు కుంటలు నింపుకొని.. రెండు పంటలు పండించే విధంగా చూస్తామని ఈ సందర్భంగా హరీష్‌ అన్నారు. 

‘మంచినీరు కావాలని కాంగ్రెస్ పార్టీకి గతంలో ఓట్లు వేసి వేసి చేతులు నొప్పి పెట్టినయ్. తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధి చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు నూకలు చెల్లినయ్‌. ఈ మున్సిపల్ ఎన్నికల్లో దుబ్బాకలో ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్, బీజేపీ గెలవదు. చీకోడ్ గ్రామాన్ని దోమలు, ఈగలు లేని పల్లెగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిది. రాబోయే రోజుల్లో మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం. క్యాన్సర్ బారిన పడొద్దంటే ప్లాస్టిక్ నిషేధించాలి. అన్ని రంగాల్లో తెలంగాణ ముందుంది. చదువులో మాత్రం వెనుకుంది. చీకోడ్ గ్రామంలో 100% అక్షరాస్యత సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రతి మూణ్ణెళ్లకోసారి చీకోడ్ సందర్శించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా’అన్నారు.

>
మరిన్ని వార్తలు