‘కేసీఆర్‌ సరైన సమాధానం ఇవ్వాలి’..

6 Sep, 2018 18:18 IST|Sakshi
గట్టు శ్రీకాంత్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రభుత్వం తొమ్మిది నెలల ముందే పోవటం ఏంటనేది కేసీఆర్‌ సరైన సమాధానం ఇవ్వాల్సి ఉందని తెలంగాణ వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా యువతకి ఉద్యోగాలు ఇచ్చారని ముందస్తుకు వెళ్తున్నారా..? ఏ హామీ నెరవేర్చారని ముందస్తుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్‌ అభిమానులు అనేక మంది ఉన్నారని అన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాల హమీలను మరిచిన సంగతిని వైఎస్సార్‌ సీపీ ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ తెలంగాణలో ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందనేది తీర్మానం చేసి జాతీయ అధ్యక్షుడికి పంపిస్తామని అన్నారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడి నిర్ణయం ప్రకారం ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది నిర్ణయిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో పొత్తుల విషయం కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

మరిన్ని వార్తలు