బెంగాల్‌లో ప్రచారానికి ఇమ్రాన్‌ఖాన్‌!

22 Apr, 2019 15:12 IST|Sakshi

ఆయనను పిలిచేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్లాన్‌ చేస్తోంది

న్యూఢిల్లీ : బంగ్లాదేశీ నటులు ఫెర్దోస్‌ అహ్మద్‌, నూర్‌ ఘాజీలను రప్పించి.. పశ్చిమ బెంగాల్‌లో తమ​ పార్టీ తరఫున తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్‌ నేత, ఒకప్పటి మమతా బెనర్జీ కుడిభుజం ముకుల్‌ రాయ్‌ ఘాటైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోల్‌కతాలో ప్రచారానికి పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను పిలువాలని టీఎంసీ ప్లాన్‌ చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

‘పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ అయిన ఇమ్రాన్‌ ఖాన్‌ను బెంగాల్‌లో ప్రచారానికి టీఎంసీ ఆహ్వానించింది. ఈ విషయమై నాకు సమాచారముంది. అందుకే ఆ పార్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశాను’ అని ముకుల్‌ రాయ్‌ సోమవారం విలేకరులతో పేర్కొన్నారు. ఈ విషయం మీకు ఎలా తెలుసు అని మీడియా ప్రశ్నించగా.. ‘ఫెర్దోస్‌ అహ్మద్‌, నూర్‌ ఘాజీలను ప్రచారానికి పిలుస్తున్న విషయాన్ని ముందు ప్రకటించారా? అదేవిధంగా ఇది కూడా జరగనుందని మాకు వినిపిస్తోంది. అందుకే ఈసీని అలర్ట్‌ చేశాం’ అని ఆయన చెప్పుకొచ్చారు.
 

>
మరిన్ని వార్తలు