ఉమ్మడి జిల్లాలో పరిశీలకుల నియామకం
నియోజకవర్గాల వారీగా వెల్లడించిన మంత్రి దయాకర్ రావు
ఆరు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచన
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) దూకుడు పెంచింది. నిన్న, మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రమించిన గులాబీ శ్రేణులను మళ్లీ ఎన్నికలకు సంసిద్ధులను చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సమావేశమై స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు స్థానాలను గెలుచుకోవడంతో పాటు అన్ని ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను చేజిక్కించుకుని విజయబావుటా ఎగురవేయాలని ఆయన టీఆర్ఎస్ నేతలకు తేల్చిచెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని, వచ్చే పరిషత్ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నిలపాలని అధినేత మార్గదర్శనం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎన్నికల సందర్భంగా పార్టీ శ్రేణులకు అండగా నిలిచేందుకు ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలను బుధవారం నియమించారు. ఇందులో శాసనసభ్యులతో పాటు పార్టీ ముఖ్యనేతలకు భాగస్వామ్యం కల్పించారు. ఈ సందర్భంగా వారు పార్టీ శ్రేణులతో మమేకం కావడంతో పాటు ప్రజల్లోకి వెళ్లి రానున్న పరిషత్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు.
పరిశీలకులు వీరే...