అందరికీ  కేబినెట్‌లో చోటెలా? 

10 Dec, 2019 08:34 IST|Sakshi

గెలిచిన 11 మంది అనర్హులు

సాక్షి, బెంగళూరు: అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను ఎన్నికల్లో గెలిపిస్తే మంత్రి పదవులు ఇస్తామని సీఎం యడియూరప్ప ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రకటించారు. ఎన్నికల్లో 13 మంది అనర్హులు బీజేపీ తరఫున పోటీ చేయగా 11 మంది విజయం సాధించారు. వారందరికీ మంత్రి పదవులు ఇస్తా రా? అనేది ఉత్కంఠగా మారింది. వారికి కేబినెట్‌లో చోటిస్తే బీజేపీలో సీనియర్‌ నేతలు భగ్గుమనే ప్రమాదం ఉంది. దీనికి తోడు ఓడిన ఎంటీబీ నాగరాజు, హెచ్‌.విశ్వనాథ్, టికెట్‌ దక్క ని ఆర్‌.శంకర్‌కు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలన్నా ఖాళీలు లేవు.

జిల్లాకు  నలుగురు మంత్రులా? 
ఉప ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌గా మారిన బెళగావి జిల్లా రాజకీయాలు ఫలితాల అనంతరం కూడా వేడిగానే ఉన్నాయి. జిల్లా నుంచి ప్రస్తుతం లక్ష్మణ సవది మంత్రివర్గంలో ఉన్నారు. అ యితే మరో ముగ్గురు (గోకాక్‌ – రమేశ్‌ జార్కిహోళి, కాగవాడ – శ్రీమంతపాటిల్, అథణి – మహేశ్‌ కుమటళ్లి) ప్రస్తుతం గెలిచారు. ఇచ్చిన మాట ప్రకారం ముగ్గురికి మంత్రి పదవులు వస్తే జిల్లా నుంచి నలుగురు కేబినెట్‌లో ఉంటారు. ఇక ఉత్తర కన్నడ జిల్లా నుంచి హెబ్బార్‌కు, చిక్కబళ్లాపుర నుంచి కె.సుధాకర్‌కు మంత్రి పదవి దక్కాల్సి ఉంది.

బెంగళూరు నుంచి  అరడజను పైగా  
మంత్రివర్గంలో బెర్తు ఆశించిన యశవంతపుర – ఎస్‌టీ సోమశేఖర్, మహలక్ష్మి లేఅవుట్‌ – కె.గోపాలయ్య, కృష్ణరాజపురం – భైరతి బసవరాజుకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని సమాచారం. కాగా బెంగళూరు పరిధిలో ప్రస్తుతం అశ్వర్థ నారాయణ (మల్లేశ్వరం), ఆర్‌.అశోక్‌ (పద్మనాభనగర), సురేశ్‌ కుమార్‌ (రాజాజీనగర), సోమణ్ణ (గోవిందరాజనగర) కేబినెట్‌లో కొనసాగుతున్నారు. మండ్య నుంచి కేబినెట్‌లో చేరే ఏకైక మంత్రిగా కేసీ నారాయణెగౌడ అవుతారు. అదేవిధంగా బళ్లారి జిల్లాకు కూడా (ఆనందసింగ్‌ – విజయనగర) మంత్రిగిరి రావాలి. వీరందరికీ పదవులు ఎలా సాధ్యం, యడియూరప్ప ఎలా పరిష్కరిస్తారన్నది పార్టీలో చర్చనీయాంశమైంది. 
 

మరిన్ని వార్తలు