అవును టీడీపీని వీడుతున్నా: టీజీ

20 Jun, 2019 17:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ ధ్రువీకరించారు. తాను బీజేపీలో చేరబోతున్నట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు. గతంలో తాను బీజేపీ యూత్‌ వింగ్‌లో సభ్యుడినని టీజీ వెంకటేశ్‌ తెలిపారు. అప్పటి నుంచే తనకు బీజేపీతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. పార్టీ మార్పుపై ఇప్పటికే ఎంపీలు సంతకాలు చేసి తాము రాజ్యసభ చైర‍్మన్‌కు అందచేశామన్నారు.  తమను బీజేపీలో విలీనం చేయాలని లేదా ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశామన్నారు.

వారం క్రితమే చంద్రబాబు నాయుడుని కలిశానని, అయితే పార్టీని వీడొద్దని ఆయన చెప్పారన్నారు. ప్రజా నిర్ణయంలో పాటు, తమ ప్రాంత అభివృద్ధి మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌, గరికపాటి మోహన్‌ రావు, టీజీ వెంకటేశ్‌ కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో రాజ్యసభలో టీడీపీ ఎంపీలు ఆరుగురు ఉండగా...నలుగురు బీజేపీలో చేరనుండటంతో ఇక ఇద్దరే మిగిలారు.

చదవండి: టీడీపీలో భారీ సంక్షోభం!

మరిన్ని వార్తలు