‘ప్రజలే కాంగ్రెస్‌కు షోకాజ్‌ నోటీసులు ఇస్తారు’

20 Jun, 2019 17:09 IST|Sakshi

నల్లగొండ : కాంగ్రెస్‌ పార్టీ తనకు షోకాజ్‌ నోటీస్‌ ఇవ్వడం కాదని.. ప్రజలే ఆ పార్టీకి షోకాజ్‌ నోటీసులు ఇస్తారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తనకు కాంగ్రెస్‌ పార్టీ షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంపై విమర్శలు చేయడంతో పాటు.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నయం అని వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్‌రెడ్డికి టీపీసీసీ షోకాజ్‌ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం నల్లగొండలో మీడియాతో మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డి.. కాంగ్రెస్‌ నేతలు గ్రూపు రాజకీయాలతో పార్టీని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తను నిజాలు మాట్లాడితే కాంగ్రెస్‌ నేతలకు జీర్ణం కావడం లేదన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంలో తప్పుచేశారని..  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రచారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిందని చెప్పారు.

భవిష్యత్‌లో తెలంగాణలో కాంగ్రెస్‌ కోలుకునే అవకాశం కనిపించడం లేదన్నారు. మునుగోడు నియోజకవర్గ క్యాడర్‌తో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. తను కాంగ్రెస్‌ పార్టీ దుస్థితిపై మాట్లాడితే.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి వేలాది ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని చెప్పారు. తాము  గాంధీ భవన్‌ నేతలం కాదని.. ప్రజల మునుషులమని పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం కేసీఆర్‌తో మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్‌, మై హోమ్‌ రామేశ్వరరావులతో కేసీఆర్‌ నిత్య సంబంధాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఉత్తమ్‌ పార్టీ నుంచి తప్పుకుంటేనే పార్టీ బాగుపడుతుందని వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు