సాక్షి, కైకలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ 159వ రోజు పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. శనివారం ఉదయం రాజన్న బిడ్డ కైకలూరు నియోజకవర్గంలోని గన్నవరం క్రాస్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
అక్కడి నుంచి పాదయాత్ర మండవల్లి, చిగూరుకోట క్రాస్ మీదుగా భైరవ పట్నం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. తిరిగి పాదయాత్ర మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. అనంతరం పాదయాత్ర ఛావలి పాడు మీదుగా కైకలూరుకు చేరుకుంటుంది. కైకలూరు గాంధీ బొమ్మ సెంటర్లో జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రికి రాజన్న బిడ్డ అక్కడే బస చేస్తారు. అడుగడుగునా జననేతకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.