సాక్షి, నర్సారావుపేట: ‘నర్సారావుపేటలోని వ్యాపారులు, దుకాణదారులు జీఎస్టీతో బాధపడుతున్నారు. జీఎస్టీకి అదనంగా రాష్ట్రంలో టీఎస్టీ కూడా ఉంది. టీఎస్టీ అంటే తెలుగు తమ్ముళ్లకు సంబంధించిన సర్వీస్ టాక్స్. జన్మభూమి కమిటీల నుంచి ప్రాజెక్టుల వరకు ప్రతి విషయంలో తెలుగుదేశం సర్వీస్ ట్యాక్స్ (టీఎస్టీ) కట్టాల్సిన పరిస్థితి నెలకొంది’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. టీడీపీ అవినీతిపై మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా నర్సారావుపేట పట్టణంలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. అశేషంగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. టీఎస్టీతోపాటు నర్సాపేట నియోజకవర్గంలో కేఎస్టీ ట్యాక్స్ కూడా కట్టాల్సిన పరిస్థితి నెలకొందని, రైల్వే కాంట్రాక్టుల నుంచి విద్యుత్ ప్రాజెక్టులు వరకు, కొటప్పకొండ కాంట్రాక్టు నుంచి మద్యం కాంట్రాక్టుల వరకు, కొత్త సినిమా రిలీజైనా ఆఖరికీ ఆటోలు, తోపుడు బండ్ల నుంచి కేఎస్టీ వసూలు చేస్తున్నారని నర్సారావుపేట టీడీపీ ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. ఇలా టీఎస్టీ, కేఎస్టీ పేరుతో ప్రజల్ని దోచుకుంటున్నారని, ఎక్కడచూసినా లంచం, లంచం, లంచం ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అభివృద్ధిలో పురోగతి సాధించిందో లేదో తెలియదుకానీ, అవినీతిలో మాత్రం దేశంలోనే నంబర్వన్ పురోగతి సాధించిందని దుయ్యబట్టారు. నర్సారావు పేట నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుచేయాలని, నర్సారావు నుంచి చీరాల వరకు రోడ్డును నాలుగులైన్లుగా విస్తరించాలని, పెరుగుతున్న అవసరాల మేరకు నర్సారావుపేటలో మరో మంచినీటి రిజర్వాయర్ ఏర్పాటుచేయాలని ప్రజలు అడుగడుగునా తనను కలిసి అర్జీలు సమర్పిస్తున్నారని వైఎస్ జగన్ తెలిపారు. ఈ సమస్యలను టీడీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..