సీఎం ఎలాంటి పనులు చేయకూడదో చూపించారు : వైఎస్‌ షర్మిల

2 Apr, 2019 20:19 IST|Sakshi

సాక్షి, కృష్ణా : సీఎం ఎలా ఉండాలో.. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చూపిస్తే.. సీఎం ఎలాంటి పనులు చేయకూడదో చంద్రబాబు చూపించారని వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల అన్నారు. ఎన్నిక ప్రచారంలో భాగంగా హనుమాన్‌ జంక్షన్‌లో మాట్లాడుతూ.. కుల, మత, పార్టీలకతీతంగా మేలు చేసిన ఏకైక సీఎం వైఎస్‌ఆర్‌ అని కొనియాడారు. కానీ, చంద్రబాబు మాత్రం రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను దగా చేశారన్నారు. మూడేళ్లలో పోలవరం  పూర్తిచేస్తామని బాబు చెప్పారు కానీ ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారన్నారు. కమీషన్ల కోసమే పోలవరం అంచనాలను పెంచేశారని పేర్కొన్నారు.

చంద్రబాబుది మాట మీద నిలబడే నైజం కాదని, అమరావతిలో పర్మినెంట్‌గా ఒక్క బిల్డింగ్‌ను కూడా నిర్మించలేదన్నారు. బీజేపీతో కుమ్మక్కై.. చంద్రబాబు హోదాను నీరుగార్చారని విమర్శించారు. బాబు వస్తే జాబు అన్నారు.. కానీ లోకేష్‌కు మాత్రమే జాబు వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు.. నోటిఫికేషన్లు లేవని మండిపడ్డారు. హోదాపై బాబు ఎన్నిసార్లు మాటలు మార్చారో.. అందరికీ తెలుసునన్నారు. బాబు మార్చే రంగులు చూస్తే ఊసరవెళ్లి కూడా సిగ్గుతో పారిపోతుందన్నారు.

జగనన్న పోరాటం వల్లే ప్రత్యేకహోదా ఈరోజుకీ బతికి ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ ధర్నాలు, దీక్షలు చేశారన్నారు. హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు రాజీనామా చేశారని గుర్తు చేశారు. మరోసారి చంద్రబాబు మోసం చేయాలని వస్తున్నారు.. నమ్మకండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పాత హామీలకు సమాధి కట్టి.. కొత్త హామీలు ఇస్తున్నారని అన్నారు. చంద్రబాబు వస్తే కరువు వచ్చింది.. బాబును సాగనంపాలని ప్రజలను కోరారు. బైబై బాబు.. ఇదే ప్రజాతీర్పు కావాలని అన్నారు.

మరిన్ని వార్తలు