విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలి : వైఎస్‌ విజయమ్మ

2 Apr, 2019 19:54 IST|Sakshi

సాక్షి, విజయనగరం : ఈ ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి, దర్మానికి అధర్మానికి, అవకాశవాదానికి.. మాటమీద నిలబడేవారికి మధ్య జరగుతోందని, విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టాలి అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ప్రజలను కోరారు. సాలూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ..  ‘మన అనుబంధం దాదాపు 40 ఏళ్లది. రాజశేఖర్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత.. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనుకున్నారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరికీ సంక్షేమా పథకాలు అందాలనుకున్నారు. ఆయన పాలనలో ఒక్క పైసా పన్ను కూడా పెరగలేదు’అని అన్నారు.

విజయమ్మ మాట్లాడుతూ.. ‘ప్రస్తుత పాలనలో అక్రమం, దౌర్జన్యం, మోసం మాత్రమే ఉన్నాయి. ఆనాడు వృద్దుల కోసం ఫించను తీసుకొచ్చారు. రైతే రాజు కావాలని, వ్యవసాయం పండగ చేయాలని జలయజ్ఞం తీసుకొచ్చారు. మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్‌పై పెట్టారు. ఆ రోజు రాజశేఖర్‌ రెడ్డి గారు మొదలు పెట్టిన ప్రాజెక్ట్‌లే.. ఇంకా పూర్తి చేయలేకపోయారు. డ్వాక్రా మహిళలను ఆదుకున్నారు. ఆరోగ్య శ్రీ, 108 పథకాలు ఎంతో మంది ప్రాణాలు కాపాడాయి. ప్రతీ పేదవాడి పిల్లలు చదువుకోవాలని ఫీరీయింబర్స్‌మెంట్‌ తీసుకొచ్చారు. ఆనాడు కేంద్రప్రభుత్వం గ్యాస్‌పై రూ.50 పెంచితే.. ప్రభుత్వమే భరించింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఒక్క ప్రాజెక్ట్‌కూడా పూర్తి కాలేద’ని విమర్శించారు. 

‘ఆ ప్రభుత్వాన్ని చూసి అన్నివర్గాల వారు సంతోషంగా ఉన్నారు. రాజశేఖర్‌ రెడ్డి గారు లేకపోవడం వల్ల నాకు వచ్చిన నష్టం కంటే.. మీకు కలిగిన నష్టమే ఎక్కువ అని అనిపిస్తూ ఉంటుంది. ఆరోజు.. అసెంబ్లీ సమావేం అయింది. వర్షం ఎక్కువగా ఉంది.. ఈ సమయంలో వెళ్లడం అవసరమా అని అన్నాను. కానీ ఆయన వినలేదు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలి అని బయల్దేరారు. ఆయన పోయాక అందరూ మమ్మల్ని వదిలివెళ్లారు.. కానీ మీరు మాత్రం వదల్లేదు. జగన్‌.. ఓదార్పు చేయడానికి వెళ్తే.. జగన్‌కే ఓదార్పు ఇచ్చారు.. అది నేను ఎప్పటికీ మరవలేన’ని అన్నారు.

‘ఆయనపై ప్రజలు ఇంత అభిమానం చూపటం కాంగ్రెస్‌కు నచ్చలేదు. ఆయన చనిపోయాక.. రాజకీయాల్లో రావాలని అనిపించలేదు.. మీరు చూపించే ప్రేమ కోసమే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాను. ఎన్ని రకాలుగా బాధలు పెట్టినా.. జగన్‌ కదల్లేదు.. స్థిరంగా ఉన్నాడు. ప్రత్యేక హోదా కోసం అనేక పోరాటాలు చేశారు. ఎక్కడ ఎవరికీ ఏ కష్టం వచ్చినా..  జగన్‌ వచ్చేవాడు. నా బిడ్డ మీ అందరికీ అండగా ఉంటాడు.. జగన్‌ బాబు ఏదైనా అనుకుంటే సాధిస్తాడు.. జగన్‌ను జైల్లో పెట్టినప్పుడు.. 18 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ వచ్చినప్పుడు.. ఆ రోజు మీముందుకు రావల్సిన పరిస్థితి వచ్చింది. నాటి ఎన్నికల్లో 16మంది భారీ మెజార్టీతో గెలిచారు. అవతలివారికి డిపాజిట్లు కూడా రాలేదు. మాకు సమస్య వచ్చినప్పుడు మీరున్నారు.. మీకు కష్టమొస్తే మేమున్నాము.. చంద్రబాబు నాలుగేళ్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో పెట్టుకున్నారు. అప్పుడు చంద్రబాబే.. తల్లి కాంగ్రెస్‌ పిల్లకాంగ్రెస్‌ అని అన్నాడు. చంద్రబాబే ఇప్పుడు కాంగ్రెస్‌తో ఉన్నాడు. జగన్‌ బీజేపీతో, కేసీఆర్‌తో ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. జగన్‌ ఎప్పుడూ ఒక్కడే.. సింహం సింగిల్‌గానే వస్తుంది. జగన్‌కు పొత్తు ఏదైనా ఉంటే.. అది ఆంధ్ర ప్రజానికంతోనే’ అని అన్నారు.

మరిన్ని వార్తలు