‘ఐదు దశాబ్దాలుగా దళితులను ఓటెయ్యనీయలేదు’

15 May, 2019 22:04 IST|Sakshi

తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గంలో ఈ రోజు రీపోలింగ్‌కు ఆదేశించిన ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో ఐదు దశాబ్దాలుగా దళితుల్ని  ఓటు వేయకుండా అడ్డుకున్నారని చంద్రగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో చెవిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. రీపోలింగ్‌ జరుగుతున్న ఐదు కేంద్రాల్లో దళితుల్ని ఓటు వేయనివ్వడం లేదని అధికారులు కలెక్టర్‌కు నివేదిక ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దళితులకు ప్రత్యేకంగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని గతంలోనే ఫిర్యాదు చేశాం.. అయినా కలెక్టర్‌ పట్టించుకోలేదని చెప్పారు. పోలింగ్‌ రోజు దళితులను ఓటు వేయనీయడం లేదని, పోలింగ్‌ కేంద్రంలో వీడియో ఫుటేజీ తనిఖీ చేసి అన్ని విషయాలు చూడమని ఆరోజే ఫిర్యాదు చేశామన్నారు.

మొత్తం ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ చేయాలని ఫిర్యాదు చేశాం.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పట్టించుకోలేదని ఆరోపించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఆ రోజు ఒకే వ్యక్తి ఓటు వేస్తున్న విజువల్స్‌ సీసీటీవీ పుటేజీలో స్పష్టంగా ఉంది..అయినా కూడా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ స్పందించలేదని అన్నారు.  చిత్తూరు జిల్లా కలెక్టర్‌ రీపోలింగ్‌కు బాధ్యత వహించాలని కోరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు గతంలో చేసిన వ్యాఖ్యలపై చెవిరెడ్డి మండిపడ్డారు. దళితులు, గిరిజనులకు ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణం కల్పించాలని కోరుతున్నట్లు చెప్పారు. చిత్తూరు కలెక్టర్‌, ఎస్పీ చేసిన తప్పిదాల వల్లే ఈ రీపోలింగ్‌ వచ్చిందన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్‌ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు