దళిత సంక్షేమం ఉట్టిపడేలా వైఎస్సార్‌ సీపీ మ్యానిఫెస్టో

28 Feb, 2019 14:01 IST|Sakshi

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో దళిత సంక్షేమం ఉట్టిపడేలా ఉంటుందని వైఎస్సార్‌ సీపీ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు మేరుగ నాగార్జున తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ ఎస్సీ అధ్యయన కమిటీ సమావేశంలో అన్ని అంశాలు చర్చించామన్నారు. గతంలో వైఎస్సార్ హయాంలో దళిత సంక్షేమం ఎలా జరిగింది, చంద్రబాబు వాటిని ఎలా తుంగలో తొక్కి పాలించారు అనే విషయాలు చర్చించామని తెలిపారు. తమ పార్టీ మ్యానిఫెస్టోలో దళిత సంక్షేమం కోసం ఏ ఏ అంశాలు పెట్టాలి అన్న దానిపై చర్చించినట్లు వెల్లడించారు. తమ పార్టీ దళిత నేతలు అనేక సూచనలు చేశారని చెప్పారు. టీడీపీలో ఉన్న దళిత నేతలు కళ్లులేని కబోదుల్లా ఉన్నారని మండిపడ్డారు. 

వైఎస్‌ జగన్‌ సీఎం అయితేనే దళితులకు న్యాయం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయితేనే దళితులకు న్యాయం జరుగుతుందని వైఎస్సార్‌ సీపీ నేత పండుల రవీంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  తమ పార్టీ మ్యానిఫెస్టోలో దళితులకు సంబంధించి అన్ని విషయాలను కూలంకషంగా చర్చించామన్నారు. ఎస్సీలకు పార్టీలో పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు.

మరిన్ని వార్తలు