పవన్‌ కల్యాణ్‌ ఓ బచ్చా

5 Dec, 2018 09:07 IST|Sakshi
హెచ్‌.ఎ.రెహమాన్‌

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓ బచ్చా అని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్‌.ఎ.రెహమాన్‌ మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సినిమాల్లో నటించినట్లు రాజకీయాల్లో నటిస్తే కుదరదని హెచ్చరించారు. వైఎస్‌ పాలన గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిదని ప్రశ్నించారు. పవన్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, వెంటనే పిచ్చాసుపత్రికి తరలించి చికిత్స అందించాలని కోరారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు.

నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, అన్యాయాలను పక్కన పెట్టి వైఎస్సార్‌ గురించి మాట్లాడటంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ఐదేళ్లకోసారి పార్టీలు మారుస్తూ కాపురం చేసే చంద్రబాబు, ఆర్నెల్లకోసారి పెళ్లాలను మార్చే పవన్‌ ఒక్కటయ్యారని ఆరోపించారు. ఏపీలోని దోచుకున్న అవినీతి సోమ్ము తెలంగాణలో ఖర్చు పెడుతున్నారని, విచ్చలవిడిగా టీడీపీ నాయకుల ఇళ్లలో నగదు దొరుకుతోందని తెలిపారు. తిత్లీ తుపాను బాధితులను మరచి తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్ని కుట్రలు చేసినా ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్‌ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వెనుకబడిన ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు సాధ్యం కాదని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. నాడు వైఎస్సార్‌ ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని, అందుకే మైనార్టీల భుజాలపై మహానేత వైఎస్సార్‌ ఉన్నారని చెప్పారు. వైఎస్‌ ఆశయ సాధన కోసం జగన్‌ పాటుపడుతున్నట్లు వివరించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రజాకూటమి, బీజేపీలను నమ్మి మోసపోవద్దని కోరారు. ఏపీలో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో స్వర్ణయుగం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు